
మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి
విశాఖసిటీ: మీ సంకల్పానికి సలాం చేస్తూ.. బాధల బందిఖానా నుంచి విముక్తి పొందే భరోసా ఇస్తారనే ఆశతో విశాఖ జిల్లా మీ రాక కోసం ఎదురు చూస్తోందని వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి విశాఖ జిల్లాకు అన్న ఎప్పుడొస్తారనే ఆసక్తి, ఉత్సుకత ప్రజల్లో పెరిగిందని వివరించారు. సోమవారం పాదయాత్ర ముగిసిన అనంతరం జగన్మోహన్రెడ్డి రాత్రి బస చేసిన తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఉప్పరగూడెంలో ఆయనతో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పాదయాత్ర జరుగుతున్న తీరు గురించి సవివరంగా చర్చించారు. ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖ జిల్లాలో మంగళవారం అడుగు పెడుతున్న నేపథ్యంలో ప్రజలు, అభిమానులు ఘనస్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారని వివరించారు. వారి బాధలు, జిల్లాలో భూ బకాసురులు చేస్తున్న అన్యాయాలు, అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలతో పడుతున్న ఇబ్బందులు, బాధల్ని ఏకరువు పెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చిందనే సంతోషం జిల్లా వాసుల్లో కనిపిస్తోందన్నారు. అంతకు ముందు.. విజయసాయిరెడ్డి ప్రజాసంకల్పయాత్ర సాగే రూట్లలో పర్యటించారు. దాదాపు నెల రోజులకు పైగా విశాఖ జిల్లాలో సాగనున్న పాదయాత్ర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు జగన్మోహన్రెడ్డి సంకల్పం, పాదయాత్ర సాగే విధానంపై దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, జి. రవిరెడ్డి, పార్టీ నాయకుడు కిరణ్రాజు తదితరులున్నారు.
ఘనంగా స్వాగతిద్దాం
నర్సీపట్నం: జిల్లాలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్రను దిగ్విజయం చేయాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక కృష్ణాప్యాలస్లో సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పది జిల్లాల్లో ఈ ప్రజాసంకల్ప యాత్ర అద్భుతరీతిలో కొనసాగిందన్నారు.
మాకవరపాలెం (నర్సీపట్నం): రానున్న ఎన్నికల్లో టీడీపీని సమర్థంగా ఎదుర్కోవాలని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ నేత రుత్తల యర్రాపాత్రుడిని పార్టీలోకి ఆహ్వానించేందుకు సోమవారం ఆయన మాకవరపాలెం వచ్చారు. ఆయనకు నేతలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యర్రాపాత్రుడితో చర్చించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉందని, గత నాలుగున్నరేళ్లుగా ప్రజలకు తీరని అన్యాయం చేశారన్న భావన అధిక శాతం ప్రజల్లో ఉందన్నారు. గత 40 ఏళ్లకు పైగా ప్రజలతో మమేకమైన యర్రాపాత్రుడు వైఎస్సార్సీపీలో చేరేందుకు నిర్ణయించుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆయన రాకతో నియోజకవర్గంలో పార్టీ మరింత పటిష్టమవుతుందన్న విశ్వాసంతో జగన్మోహన్రెడ్డితోపాటు ఇతర నాయకత్వం ఉందన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. యర్రాపాత్రుడు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. నర్సీపట్నం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్గణేష్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అధినేతకు అపూర్వ స్వాగతం పలకాలి : పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్
నక్కపల్లి (పాయకరావుపేట): ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజా సంకల్పయాత్రలో బాగంగా మంగళవారం విశాఖ జిల్లాలోకి అడుగిడుతున్న పార్టీ అ«ధినేత జగన్ మోహన్ రెడ్డికి కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వ స్వాగతం పలకాలని అనకాపల్లి పార్లమెంట్జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపు నిచ్చారు. మంగళవారం గన్నవరం మెట్టవద్ద విశాఖ జిల్లాలో ప్రవేశి స్తున్న పాదయాత్ర ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన ఆయన నర్సీపట్నంలో విలేకర్లతోమాట్లాడుతూ మంగళవారం ఉదయం పాదయా త్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తుందన్నారు. నర్సీ పట్నం నియోజకవర్గం నుంచి మొదలవుతుందన్నారు. జిల్లానలుమూలల నుంచి ము ఖ్యనాయకులు, సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు జగన్కు ఘనస్వాగతం పలికేందుకు గన్నవరం మెట్టవద్దకు తరలి రావాలన్నారు. జగనన్న అడుగులో అడుగేస్తూ పాదయాత్రకొనసాగించాలన్నారు. జగన్కు సాదర స్వాగతం పలికి జిల్లాలోకి తోడ్కొని రావాలన్నారు.