
సాక్షి, ఎచ్చెర్ల (శ్రీకాకుళం): ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 313వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో అశేష ప్రజానీకం అపూర్వ ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగుతోంది.
జననేత బుధవారం ఉదయం సంతవురిటి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దవళ పేట, ఆనందపురం ఆగ్రహారం, వాండ్రంగి మీదుగా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరుకు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి రాపాక జంక్షన్, ఎరుకలపేట క్రాస్, కృష్ణాపురం మీదుగా రెడ్డి పేట వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 312వ రోజు ముగిసింది. మంగళవారం ఉదయం అంతకపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి ఆగ్రహారం, పొగిరి, మర్రివలస, గేదెలపేట, మెట్టవలస, పాలఖండ్యం మీదుగా సంతవురిటి వరుకు నేటి పాదయాత్ర కొనసాగింది. రాజన్న తనయుడు మంగళవారం 11.3 కిలోమీటర్లు నడిచారు. దీంతో జననేత ఇప్పటివరకు 3,380.8 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు.