తిరుపతిలో కలనరీ ఇన్‌స్టిట్యూట్ | Tirupati kalanari Institute | Sakshi
Sakshi News home page

తిరుపతిలో కలనరీ ఇన్‌స్టిట్యూట్

Aug 3 2014 5:13 AM | Updated on Sep 2 2017 11:17 AM

తిరుపతిలో కలనరీ ఇన్‌స్టిట్యూట్

తిరుపతిలో కలనరీ ఇన్‌స్టిట్యూట్

దేశంలో తొలి ఇండి యన్ కలనరీ ఇన్‌స్టిట్యూట్ (భారతీయ పాకశాస్త్ర శిక్షణ సంస్థ) తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నారు.

  •      9న శంకుస్థాపన చేయనున్న కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి
  •      చిరంజీవి పర్యాటకశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడే మంజూరు
  •      దేశంలో తొలి కలనరీ ఇన్‌స్టిట్యూట్ ఇదే..
  •      సంస్థకు అనుబంధంగా ముంబయి, ఢిల్లీలో క్యాంపస్‌ల ఏర్పాటు
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: దేశంలో తొలి ఇండి యన్ కలనరీ ఇన్‌స్టిట్యూట్ (భారతీయ పాకశాస్త్ర శిక్షణ సంస్థ) తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థ అనుబంధంగా ముంబయి, ఢిల్లీలో క్యాంపస్‌లు ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 2014-15 బడ్జెట్లో రూ.50 కోట్లు మంజూరు చేసింది. సంస్థ పనులకు ఈ నెల 9న తిరుపతి సమీపంలో కుర్రకాలువ వద్ద కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ శంకుస్థాపన చేయనున్నారు. వివరాలు.. పీఆర్పీని స్థాపించిన చిరంజీవి ఆ పార్టీ టికెట్‌పై 2009లో తిరుపతి శాసనసభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు.

    పీఆర్పీని కాం గ్రెస్‌లో విలీనం చేశాక ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేశారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన చిరంజీవి.. మన్మోహన్‌సింగ్ మంత్రి వర్గంలో కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. దేశంలో విదేశీ పర్యాటకుల రద్దీ పెరిగిపోవడం.. ఆ మేరకు అతిథ్య రంగం అభివృద్ధి చెందకపోవడం పర్యాటక అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. విదేశీ మారకద్రవ్యం ఆర్జనకు పర్యాటక రంగాన్ని పటిష్టం చేయాలన్న అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా సూచనల మేరకు.. అతిథ్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నడుంబిగించింది. స్టార్ హోటళ్లు, రిసార్ట్స్‌లో పని చేసేందుకు నైపుణ్యం ఉన్న సిబ్బందిని తయారుచేయడానికి ఓ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రణాళిక రచించింది. ఆ ఆలోచల నుంచి పుట్టిందే ఇండియన్ కలనరీ ఇన్‌స్టిట్యూట్.

    ఈ ఇన్‌స్టిట్యూట్‌లో దేశ పర్యాటక రంగానికే కాకుండా విదేశాల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తయారుచేస్తారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ఢిల్లీలో ఏర్పాటుచేయాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ.. ఈలోగా ఆంధ్రప్రదేశ్‌లో విభజనోద్యమం తారస్థాయికి చేరింది. సీమాంధ్రలో చెలరేగిన ఉద్యమాన్ని చల్లార్చడానికి తిరుపతిలో ఇండియన్ కలనరీ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

    ఈ నేపథ్యంలో తిరుపతికి సమీపంలో రేణిగుంట వద్ద కుర్రకాలువ పరిసర ప్రాంతాల్లో సర్వే నెంబర్ 211/1లో  14.21 ఎకరాల భూమిని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రేణిగుంట విమానాశ్రయానికి ఈ ప్రాంతం 1.5 కి.మీల దూరంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో కూడా తిరుపతిలో కలనరీ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేస్తామని కేంద్రం పేర్కొనడం గమనార్హం.

    ఈ ఇన్‌స్టిట్యూట్  పనులకు ఆదివారం కేంద్ర పర్యాటక సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ శంకుస్థాపన చేస్తారని కేంద్రం ప్రకటించింది. కానీ.. చివరి నిముషంలో ఆయన పర్యటన రద్దయింది. ఈనెల 9న ఇన్‌స్టిట్యూట్ పనులకు శ్రీపాద యశోనాయక్ శంకుస్థాపన చేస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. కలనరీ ఇన్‌స్టిట్యూట్‌కు అనుబంధంగా ముంబై, ఢిల్లీలో రెండు క్యాంపస్‌లు ఏర్పాటుచేయడానికి కూడా కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఇన్‌స్టిట్యూట్‌తో పాటు రెండు క్యాంపస్‌లలో ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
     
    కలనరీ ఇన్‌స్టిట్యూట్‌కు 14.21 ఎకరాలు
     
    తిరుపతి కల్చరల్: తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలం కుర్రకాల్వ వద్ద ఇండియన్ కలనరీ ఇన్‌స్టిట్యూట్(భారతీయ పాకశాస్త్ర శిక్షణ సంస్థ) ఏర్పాటుకు సర్వేనెం బర్ 211/1లో 14.21 ఎకరాల భూ మిని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ.శర్మ శని వారం ఉత్తర్వులు జారీ చేశారు. రూ. 50 కోట్లతో ఈ సంస్థని ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించి, నిధులు కేటాయించింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement