
చంద్రబాబు అడ్డంగా దొరికినా కొన్ని పత్రికలు..
ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో సంభాషిస్తూ దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనవసర రాద్దాంతం చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో సంభాషిస్తూ దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనవసర రాద్దాంతం చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అసలు విషయాన్ని పక్కకు పెట్టి హైదరాబాద్ నగరంలోని శాంతి భద్రతలపై బాబు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో హైదరబాద్ విషయాన్ని ప్రస్తావించడం నిజంగా దురదృష్టకరమన్నారు. ముడుపుల వ్యవహారంలో నిండా మునిగిన బాబు, టీడీపీ నేతలు.. ఆంధ్రా ప్రజలను అడ్డుపెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు దుర్మార్గాన్ని, కన్నింగ్ బుద్ధిని ఆంధ్రా ప్రజలు తెలుసుకోవాలని తలసాని సూచించారు.
చంద్రబాబు అడ్డంగా దొరికినా కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు తక్కువ చేసి చూపిస్తున్నాయన్నారు. ఏడాది కాలంగా హైదరాబాద్ లో సీమాంధ్రులు ప్రశాంతంగా ఉన్నారని ఈ సందర్భంగా తలసాని తెలిపారు. వైఎస్సార్ సీపీ నేతలను తన పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబుకు ఇతర పార్టీల గురించి మాట్లాడే హక్కు ఉందా?అని తలసాని ప్రశ్నించారు.