సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ను శాంతపరచాలని భగవంతుడిని వేడుకుంటానని ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త, అవధూత దత్త పీఠం అధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ చెప్పారు.
అనకాపల్లి, న్యూస్లైన్: సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ను శాంతపరచాలని భగవంతుడిని వేడుకుంటానని ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త, అవధూత దత్త పీఠం అధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ చెప్పారు. అనకాపల్లి మండలంలోని సిరసపల్లి (అనఘాపురి)లో వెలసిన చింతామణి గణపతి దత్త క్షేత్రంలో నిర్మించిన ముఖ మండపాన్ని, నక్షత్ర, రాశి వనాలను స్వామీజీ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పరమాత్ముడిని వదిలేస్తే అంతా క్షామం, ఆందోళన, అశాంతి నెలకొంటాయని చెప్పారు. ఇటువంటి ప్రత్యేక కాలంలో కూడా తెలియని శక్తి మనల్ని రక్షిస్తుందని తెలిపారు. ధర్మాన్ని అనుసరిస్తే అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. 40 ఏళ్ల క్రితం నుంచి ఉన్న వాంఛ గత ఏడాది నెరవేరిందని, అన్ని విధాలా సరైన చోట దత్త క్షేత్రాన్ని నిర్మించాలనే ఆకాంక్ష తీరిందని తెలిపారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ రాకతో అనఘాపురిలోని దత్త క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.
గురువారం రాత్రి క్షేత్రానికి వచ్చిన స్వామీజీకి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం జరిగిన చక్రపూజలో పాల్గొన్న స్వామీజీ గణపతియాగం మహా పూర్ణాహుతిని నిర్వహించారు. ఆయన చేపట్టిన దివ్యనామ సంకీర్తనతో భక్తులు తన్మయులయ్యారు. స్వామీజీ ఇచ్చిన అనుగ్రహ సందేశాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో విన్నారు.
అనఘాపురిలో ఆధ్యాత్మిక వైభవం
దత్త క్షేత్రం పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో అనఘాపురిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఇక్కడ వెలసిన చింతామణి గణపతి ద్వితీయ నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. దీనిలోభాగంగా శుక్రవారం క్షేత్రంలో నూతనంగా నిర్మించిన ముఖ మండపం, రాశి నక్షత్ర వనాలను స్వామీజీ ప్రారంభించారు. స్వామీజీ గురువారం రాత్రి దత్త క్షేత్రానికి రాగా నిర్వాహకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. శుక్రవారం జరిగిన చక్రపూజలో పాల్గొన్న స్వామీజీ గణపతియాగం మహా పూర్ణాహుతిని నిర్వహించారు.
ఆయన చేపట్టిన దివ్యనామ సంకీర్తనతో అంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. స్వామీజీ ఇచ్చిన అనుగ్రహ సందేశాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో విన్నారు. మధ్యాహ్నం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని ప్రముఖులు, జిల్లాలోని భక్తులు స్వీకరించారు. సాయంత్రం అన్నపూర్ణ మందిరానికి స్వామీజీ శంకుస్థాపన చేశారు. దత్త క్షేత్రంలో ఉన్న చింతామణి గణపతి శుక్రవారం గంధ,ఫల అలంకరణలో భక్తులకు కనిపించారు. స్వామీజీ వస్తున్నారని తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా దత్త క్షేత్రానికి తరలివచ్చారు.
దత్త క్షేత్రాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తున్న నిర్వాహకులు ముఖ మండపాన్ని, నక్షత్ర రాశి వనాన్ని స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఆశ్రమాన్ని, దత్తక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిర్వాహకులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. దక్షిణ భారతదేశంలో వెలసిన చింతామణి గణపతి దత్త క్షేత్రాన్ని మరింత అభివృద్ధిచేసేందుకు మేనేజింగ్ ట్రస్టీ ఎం.ఎస్.ఆర్.కె. మూర్తి, ట్రస్టీ ఎం. ఆంజనేయరాజుల నేతృత్వంలోని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.