ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు రైతుల ఉసురు తీస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు కళ్లముందే పాడవడంతో చేనులోనే ప్రాణాలు తీసుకుంటున్నారు.
సాక్షి నెట్వర్క్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు రైతుల ఉసురు తీస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు కళ్లముందే పాడవడంతో చేనులోనే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆదివారం నిజామాబాద్, తూర్పుగోదావరి, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, గుంటూరు జిల్లాల్లో ఆరుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరో రైతు గుండెపోటుతో మరణించాడు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన కౌలురైతు సత్యనారాయణ (34) తాను సాగు చేసిన పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది లక్ష రూపాయలు అప్పు చేసి సాగు చేయగా నీలం తుపాను ముంచింది. ఈ ఏడాది మరో లక్ష రూపాయల అప్పు చేసి వేసిన వరి నీటమునిగింది. దీంతో మానసిక వేదనకు గురై సత్యనారాయణ ప్రాణాలు తీసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డిలో దారబోయిన బాగయ్య(48).. రెండెకరాల్లో వరి సాగుచేశాడు. అయిదు రోజుల కిందటే పంట కోశాడు.
ఇంతలోనే వాన లు రావడంతో ధాన్యం పొలంలోనే నేలపాలైంది. దీంతో పెద్దమ్మ ఇంటికి వెళ్లి వస్తానంటూ ఇంట్లోంచి వెళ్లి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం ముశిపట్లకు చెందిన కెమిడి అయిలిమల్లేశ్ (25).. పంట కోసం రూ.2.50 లక్షల పెట్టుబడులు పెట్టాడు. వానలకు పంట నేలపాలు కావడంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్లో ముక్కీస కేశవరెడ్డి(50) తనకున్న నాలుగు ఎకరాలతోపాటు మరో నాలుగు ఎకరాలను ఎకరం రూ.12 వేల చొప్పున కౌలుకు తీసుకున్నాడు. పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల పత్తి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. అప్పులు రూ.4 లక్షలకు చేరడంతో చేనుకు వెళ్లి పురుగుమందు తాగి ప్రాణాలు వదిలాడు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం హస్నాబాద్ తండాకు చెందిన రత్నావత్ ఈతానాయక్ (32) మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు. వానలకు పంట పాడవడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కూనవరం మండలం మర్రిగూడేనికి చెందిన ఆవుల వెంకటేశ్వరావు(40) పత్తి సాగు చేశాడు. వర్షాలతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పులు ఎలా తీర్చాలనే వేదనతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన గడ్డికొప్పుల రామయ్య(52) పంట నష్టాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు.