అనంతపురంలో నేడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
అనంతపురం : అనంతపురంలో నేడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హిందుపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడి వివాహానికి ఆయన హాజరు అవుతున్నారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ సీపీ నేతలు నవీన్ నిశ్చల్, ఇనాయితుల్లా, వేణుగోపాల్ రెడ్డి, రామకృష్ణారెడ్డిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బాబు పర్యటనను వారు అడ్డుకుంటారనే అనుమానంతో పోలీసులు ...వైఎస్ఆర్ సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కాగా పోలీసుల చర్యను వైఎస్ఆర్ సీపీ నేతలు ఖండించారు.
మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఆందోళనలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి ఆధ్వర్యంలో తపోవనంలో 44వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. బొమ్మన హెళ్లిలో బళ్లారి-బెంగళూరు హైవేను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దిగ్భందించి, వాహనాలను అడ్డుకున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీకి సంఘీభావంగా సమైక్యవాదులు రాయదుర్గంలో బంద్ చేపట్టారు.