
30 మంది వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్
అనంతపురం జిల్లా రాప్తాడులో ఇటీవల జరిగిన వైఎస్సార్ సీపీ నేత ప్రసాదరెడ్డి హత్యకేసులో నిందితులను అరెస్టు చేయడం కంటే...
పసాద్రెడ్డి హత్యకేసు కంటే వైఎస్సార్ సీపీ నేతల అరెస్టుపైనే అనంత పోలీసుల దృష్టి
సోమవారం గవర్నర్కు పరిస్థితిని నివేదించనున్న వైఎస్సార్సీపీ
సాక్షిప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడులో ఇటీవల జరిగిన వైఎస్సార్ సీపీ నేత ప్రసాదరెడ్డి హత్యకేసులో నిందితులను అరెస్టు చేయడం కంటే, హత్య జరిగిన ఆవేశంలో కొంతమంది ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టిన అంశాన్నే పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఈ ఘటన కు సంబంధించి 30 మందికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులను శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలకు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో చాలామంది ఘటనకు సంబంధం లేని వారు ఉన్నారు. వీరిని శనివారం కోర్టులో హాజరుపరచి రిమాండ్కు పంపారు. ఈ హత్యకేసు నేపథ్యంలో ఇటుకపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్లను వి.ఆర్.కు పంపుతూ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దుచేసినట్లు తెలిసింది. వారిని వి.ఆర్.కు పంపడాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి పరిటాల సునీత గన్మెన్లు, ఎస్కార్ట్ను వెనక్కి పంపటమేగాక శనివారం హోమంత్రి నిమ్మకాయల చినరాజప్పను కలసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వి.ఆర్. ఉత్తర్వులు రద్దయినట్లు తెలిసింది.
సీబీఐ విచారణ జరిపించాలని కోరనున్న వైఎస్సార్ సీపీ
ప్రసాదరెడ్డి హత్య కేసుపై సోమవారం గవర్నర్ నరసింహన్ను కలవనున్నట్లు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ తెలిపారు. ప్రసాదరెడ్డి హత్య ప్రభుత్వ అండదండలతో జరిగిన రాజకీయ హత్య అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. మార్చి 31న కిష్టిపాడు సింగిల్విండో అధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డిని సింగిల్విండో కార్యాలయంలో హత్య చేశారని గుర్తుచేశారు. ఇటీవల జిల్లాలో వైఎస్సార్ సీపీ నేతల హత్యలన్నీ ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగాయని, వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ను కోరతామని ఆయన తెలిపారు.