దళితులపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి చిందులు

దళితులపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి చిందులు తొక్కారు. తమ సమస్యలపై నిలదీసిన వారిపై నోరు పారేసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోణంగి గ్రామంలో చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోణంగి వెళ్లిన బడేటి బుజ్జిని... అయిదేళ్లుగా తమ సమస్యలను పరిష్కరించకపోవడంపై హరిజనపేటకు చెందిన కొందరు యువకులు నిలదీశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. ఇళ్లు ఇస్తామని టీడీపీలో చేర్చుకుని... మోసం చేశారని యువకులు ప్రశ్నలు సంధించారు. దళిత యువకులు తనను ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే బుజ్జి...’ నా సంగతి మీకు తెలియదు...తొక్క తీస్తా.. ఈడ్చి అవతల పారేస్తా’ అంటూ బెదిరించారు.

కాగా చంద్రబాబు నాయుడు పాలనలో దళితులకు అడుగడుగునా అవమానం జరుగుతోంది. ఎన్నికల సమయంలోనూ దళితులపై టీడీపీ అభ్యర్థులు నోరుపారేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం దళితులు రాజకీయాలకు పనికిరారంటూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇటీవలే ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలో దళితులపై దాడి జరిగింది. టీడీపీ నేతల వైఖరిపై దళితులు మండిపడుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top