కూటమి నిర్లక్ష్యం.. మెడికల్ పీజీ సీట్లలో కోత
మౌలిక సదుపాయాలు నిల్
ఉన్నత విద్య దూరం
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏ లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు పీజీ సీట్లలో కోత పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.525 కోట్ల అంచనాలతో ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనాస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. 2023 సెప్టెంబర్లో ఎంబీబీఎస్ తరగతులు కూడా ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో కళాశాల అభివృది పనులపై చంద్రబాబు సర్కారు పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఐదు మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ 60 పీజీ సీట్లను మంజూరు చేయగా.. దీనిలో ఏలూరు కాలేజీకి మాత్రం 4 సీట్లు మాత్రమే కేటాయించారు.
12 సీట్లు కోల్పోయి..
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏలూరు వైద్య కళాశాలకు దక్కాల్సిన మరో 12 పీజీ సీట్లు కోల్పోయినట్టు తెలుస్తోంది. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 16 పీజీ సీట్లు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 16 పీజీ సీట్లు, మచిలీపట్నం, విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెరో 12 పీజీ సీట్లు ఎన్ఎంసీ మంజూరు చేయగా.. ఏలూరుకు మాత్రం 4 సీట్లు కేటాయించారు.
ఎన్ఎంసీ తనిఖీలు
పీజీ సీట్ల మంజూరుకు సంబంధించి ఏలూరు కళాశాలలో ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చే సమయానికి గైనిక్, జనరల్ సర్జరీ, పీడియాడ్రిక్స్, అనస్థీషియా, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేయకపోవటంతో పీజీ సీట్లు కోల్పోయినట్టు పలువురు చెబుతున్నారు. ఇటీవల జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా, ఆర్థోపెడిక్స్ విభాగాలకు ఫ్రొఫెసర్ల నియామకం చేశారు. అయినా గైనిక్లో ప్రొఫెసర్ పోస్టు ఖాళీగానే ఉంది.
పీజీ సీట్లకు డిమాండ్
ఎంబీబీఎస్ వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్లకు పీజీ కోర్సు పూర్తి చేయటం జీవిత ఆశయం. ఈ నేపథ్యంలో మెడిసిన్ పీజీ సీటు కోసం కార్పొరేట్, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ధర పలుకుతుంది. ఇంతటి విలువైన పీజీ సీట్లను ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు మంజూరుపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన ప్రభుత్వం, అధికారులు అలసత్వంతోనే ఏలూరు కాలేజీ సీట్లు నష్టపోయిందని పలువురు అంటున్నారు. దీని వల్ల పేద విద్యా ర్థులకు నష్టమని అంటున్నారు.
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనం
వైద్య విద్య అభ్యసిస్తున్న మెడిసిన్ విద్యార్థులకు మూడో ఏడాది వచ్చినా సరైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవటం లేదు. ఒకవైపు భవన నిర్మాణాలు, మరో వైపు వసతి సౌకర్యాలు, ప్రధానంగా నిపుణులైన ప్రొఫెసర్ల పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యంతో పీజీ సీట్లు రాకుండా పోయాయి. మిగిలిన నాలుగు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 56 పీజీ సీట్లు వస్తే, ఏలూరుకు కేవలం 4 పీజీ సీట్లు దక్కటం బాధాకరం.
– కందుల దినేష్రెడ్డి, వైఎస్సార్సీపీ యూత్ వింగ్ రాష్ట్ర అధికార ప్రతినిధి
ఏలూరు మెడికల్ కాలేజీకి న్యాయంగా కేటాయించాల్సిన 12 పీజీ సీట్లు కోల్పోవటం బాధాకరం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతతో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ అభ్యర్థులకు ఉన్నత విద్యను చేరువ చేసేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటుచేశారు. అయితే కూటమి ప్రభుత్వం కనీసం ప్రొఫెసర్ల పోస్టులు కూడా భర్తీ చేయకపోవటంతో విలువైన పీజీ సీట్లు నష్టపోయాం. వచ్చే ఏడాదికైనా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తే బాగుంటుంది.
–ప్రత్తిపాటి తంబి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఏలూరు అధ్యక్షుడు
ఏలూరు కాలేజీకి 4 సీట్లు మాత్రమే కేటాయింపు
ప్రొఫెసర్ల నియామకం చేయకపోవడమే కారణం
మౌలిక వసతుల కల్పన లేమి
							కూటమి నిర్లక్ష్యం.. మెడికల్ పీజీ సీట్లలో కోత
							కూటమి నిర్లక్ష్యం.. మెడికల్ పీజీ సీట్లలో కోత

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
