
సన్నాల సాగు అధికమే..
ఖిలా వరంగల్: సన్నరకం వరిపంటల సాగుపై అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. మద్దతుధరపైన రూ.500 బోనస్ ఇస్తుండడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అయితే జిల్లాలోని రైతులు గత వానాకాలంలో 1.26 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఇందులో 30 వేల ఎకరాల్లో దొడ్డుగింజ రకాలు, 96 వేల ఎకరాల్లో సన్న గింజ రకాలు ఉన్నాయి. ఈ వానకాలంలోనూ 1,00,720 ఎకరాల్లో సన్న గింజ రకాలు, 30 వేల ఎకరాలకు పైగా దొడ్డు రకం సాగు చేసే అవకాశముంది. సన్న గింజ రకాల్లో సుడిదోమల వంటి చీడపీడల తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం, సస్యరక్షణ ఖర్చులు, మందుల పిచికారీ శ్రమ, లోతట్టు, వందూరు భూములు అధికంగా ఉండడంతో దొడ్డు రకాలు సైతం అధికంగానే నార్లు పోస్తున్నారు. ప్రస్తుతం మేలు రకం ధాన్యం క్వింటాకు రూ.2,320, సాధారణ రకాలకు రూ.2,300 మద్దతు ధర ఉంది. కేంద్రం క్వింటాకు రూ.69 చొప్పున పెంచిన ధరలు 2025 సెప్టెంబర్ నుంచి ఏడాదిపాటు అమల్లో ఉంటాయి. గత వానాకాలం, యాసంగిలో బోనస్ చెల్లింపులో తీవ్ర జాప్యంతో రైతులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. గత వానాకాలంలో 33 సన్నగింజ రకాలను ప్రభుత్వం గుర్తించగా నిబంధనల మేరకున్న జై శ్రీరాం తదితర రకాలను కూడా కొనుగోలు చేశారు. గింజ పొడువు 6 మిల్లి మీటర్ కన్న తక్కువ, వెడల్పు 2 మి.మీ కన్నా తక్కువ ఉండాలి. పొడవు, వెడల్పు నిష్పత్తి 2.5 మి.మీ కంటే ఎక్కువ ఉండాలి. గింజను గ్రేయిన్ కాలిపర్ మిషన్లో వేసి పొడవు, వెడల్పు కొలుస్తారు. వరంగల్ పరిశోధనా స్థానానికి చెందిన రకాలు వరంగల్ 962, వరంగల్ 1119, వరంగల్ 44, వరంగల్ 32100, వరంగల్ 697, రాజేంద్రనగర్ రకాలైన ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోన), ఆర్ఎస్ఆర్ 21278, ఆర్ఎన్ 2458, ఆర్ 2874, కేపీఎస్ 2874, హెచ్ఎంటి సోనా, జగిత్యాల పరిశోధనా స్థానానికి చెందిన జేజే ఎల్ 1798, జేజీఎల్ 3844, జేజీఎల్ 3855, జేజీఎల్ 11727, జేజీఎల్ 11118, జేజీఎల్ 17004, జేజీఎల్ 11470, జేజీఎల్ 28545, జేజీఎల్ 27356, జేజీఎల్ 384, జేజీఎల్ 3828, కూనారం పరిశోధనా స్థానం రకం కేఎన్ఎం 1638, కెఎన్ఎం733, బాపట్లకు చెందిన బీపీటీ 5204, బీపీటీ 2595, మారుటేరుకు చెందిన ఎంటీయూ 1282, నెల్లూరుకు చెందిన ఎన్డీఎల్ఆర్ 7, ఎన్ఎల్ఆర్ 34449, రుద్రూరు తదితర పరిశోధనా స్థానాల నుంచి రూపొందించిన రకాలతోపాటు మరికొన్ని ప్రైవేట్ సన్న గింజ రకాలు కూడా ఉన్నాయి.
మేలైన విత్తనాలతో అధిక దిగుబడి
130 రోజుల పంటకాలం గల మధ్యకాలిక రకాలను జూలై 10 వరకు, 120 రోజుల పంటకాలం గల స్వల్పకాలిక రకాల నార్లు జూలై నెలాఖరు వరకు పోసుకోవచ్చు. ఏ రకమైనా ఆగస్టు నెలాఖరులోపు నాట్లు పూర్తి చేయాలి. నేల స్థితిగతులు, సాగు అనుభవాలతో సన్న రకాలను ఎంచుకోవాలి. సన్నాల్లో సమగ్ర యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు.
– రాజన్న, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త,
కో ఆర్డినేటర్ మామునూరు
సన్న రకం వరి పంటపై రైతుల ఆసక్తి
రూ.500 బోనస్ చెల్లింపుతో
పెరుగుతున్న విస్తీర్ణం

సన్నాల సాగు అధికమే..