
మీ సేవ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
ఖిలా వరంగల్: మీసేవ కేంద్రాల్లో అధిక రుసుము వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని మీసేవ కేంద్రం జిల్లా మేనేజర్ రాజ్కుమార్ హెచ్చరించారు. కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు బుధవారం ఖిలా వరంగల్ మండల పరిధి మీసేవ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీసేవ కేంద్రాల ద్వారా నిర్వహించే కార్యకలాపాలను పరిశీలించారు. కేంద్రానికి వివిధ పనులపై వచ్చిన వినియోగదారులను అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీసేవ కేంద్రాలు పారదర్శకంగా పని చేయాలని, నిబంధనలు అతిక్రమించి అధికంగా వసూళ్లకు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌరులకు స్పష్టంగా కనిపించేలా పౌర సేవలు, చార్జీలను ప్రదర్శించాలని సూచించారు. అదేవిధంగా ఎప్పటికప్పడు ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలన్నారు. అనధికార ప్రదేశాల్లో మీసేవ కేంద్రాలు నడపవద్దని ఆదేశించారు. కార్యక్రమంలో మీసేవ కేంద్రాల నిర్వాహకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.