● యంత్రాలతో ఇష్టారాజ్యంగా...
● ప్రమాదం అంచున రోడ్లు
రాజాం/రేగిడి/వంగర/సంతకవిటి:
ఇసుక అక్రమ రవాణాకు రాజాం నియోజకవర్గంలోని నాగావళి నదీ తీరం కేరాఫ్గా మారింది. అధికార బలంతో నదిలో ఇసుకను ఖాళీ చేస్తున్నారు. సాగునీరు అందకుండా నదిలో పెద్దపెద్ద గోతులు చేస్తున్నారు. రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లోని నాగావళి నదీ తీర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. గతంలో అనుమతులు ఇచ్చి గడువు ముగిసిన ఇసుక రీచ్లను మళ్లీ ప్రారంభించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. గతంలో ఒకచోట ఇచ్చిన ఇసుకరీచ్ అనుమతులు మళ్లీ అదే ప్రాంతంలో ఇచ్చే నిబంధనలు లేవు. సంతకవిటి మండలంలోని తమరాం–మేడమర్తి గ్రామాల మధ్య ఇసుకరీచ్ గత రెండేళ్లుగా కొనసాగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ఇక్కడ వంతెన సమీపంలో భారీ గోతులు ఏర్పడడంతో నదీతీర ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మేడమర్తి వద్ద ఇసుకరీచ్ల్లో తవ్వకాల కారణంగా గ్రామసమీపంలోకి నదీ ప్రవాహం చేరడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
నాగావళి నదిలో అనుమతులు ఉన్న ఇసుకరీచ్లలో సైతం యంత్రాలతో ఇసుకను తవ్వేందుకు అనుమతులు లేవు. లారీలకు, ట్రాక్టర్లకు వేతనదారులతో లోడింగ్చేయాలి. ఇక్కడ అలా కాకుండా భారీ పొక్లెయిన్లు పెట్టి, నదిలో రోడ్లు వేసి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఒక్కోచోట మూడు నుంచి నాలుగు పొక్లెయిన్లు పనిచేస్తున్నాయి. రాత్రి సమయాల్లో ఇసుక రవాణా జోరుగా సాగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇసుక వ్యాపారులు ఇచ్చే మామ్మూళ్ల మత్తులో అధికారులు జోగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇసుక అక్రమ రవాణాతో రాజాం నుంచి సంతకవిటి, పొందూరు నుంచి సంతకవిటి వచ్చే రోడ్డు గోతులుమయమయ్యాయి. సింగిల్ రోడ్లలో 20 టన్నులకు మించి లోడుతో వాహనాలు రవాణా చేయకూడదు. ఇసుక రీచ్లు నుంచి 40 టన్నుల ఇసుకను తరలించే వాహనాలు తిరగడంతో రోడ్లన్నీ పాడయ్యాయి. సాగునీటి కాలువులుపై ఉన్న కల్వర్టులు కూలిపోతున్నాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి.
నాగావళి నదిలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా
భారీ యంత్రాలతో నదిని గుల్లచేస్తున్న వైనం
ఇసుక లారీల రాకపోకలతో
పాడవుతున్న పల్లె రోడ్లు, కూలుతున్న కాజ్వేలు
అధికార పార్టీ నేత కనుసన్నల్లోనే
ఇసుక దందా...
స్వామిభక్తిచూపుతున్న అధికార
యంత్రాంగం!
ఆందోళనలో నదీతీర ప్రాంత ప్రజలు


