
బడ్డీకొట్టు మాయం..!
● పేదవ్యాపారి కొట్టును లేపేసిన బడావ్యాపారి
● పోలీస్స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు
● నాన్చుడు ధోరణిలో పోలీసులు
రాజాం: ఓ పేద వ్యాపారి బడ్డీకొట్టుపై బడావ్యాపారి కన్నుపడింది. అంతే..అదే తడవుగిగా అధికారపార్టీ నాయకులను ఆశ్రయించి రాత్రికి రాత్రే చెక్క బడ్డీని అపహరించి, చెరువులో పడవేంచాడు ఆ బడా వ్యాపారి. ఈ తంతు జరిగిన వెంటనే బాధితుడు రాజాం పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేసి నాలుగురోజులు గడిచినా బాధితుడికి న్యాయం జరగలేదు. కేవలం అధికార పార్టీ ఒత్తిళ్లతోనే తనకు అన్యాయం జరుగుతోందని బాధితుడు వాపోతున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం పట్టణంలోని మాధవబజార్లో ప్రభుత్వ పాఠశాల ఎదురుగా పట్టణానికి చెందిన వడ్డి ప్రసాద్ అనే చిరువ్యాపారి గత 30 సంవత్సరాలుగా చెక్క బడ్డీ కొట్టులో ఉల్లిపాయలు, చింతపండు, కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారీ వ్యాపారంపై వస్తున్న ఆదాయంతో తనతో పాటు భార్యను పోషిస్తూ వస్తున్నాడు. ఈయన బడ్డీకొట్టు వెనుకల బండి లక్ష్మీనారాయణకు చెందిన కిరాణా వ్యాపారికి చెందిన పక్కా షాపు ఉంది. ఆ షాపుకు ఈ చిన్న బడ్డీ కొట్టు అడ్డుగా ఉండడంతో వారిద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత లక్ష్మీనారాయణ వేధింపులు ఎక్కువయ్యాయి. తన బడ్డీకొట్టు లీజుకు తీసుకున్న దస్తావేజులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉండడంతో ప్రసాద్ ఎవరికీ లొంగలేదు. తన వ్యాపారం తాను చేసుకుంటూ కాలంనెట్టుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 25 న అర్ధరాత్రి సమయంలో ప్రసాద్కు చెందిన బడ్డీ మాయమైంది. మరుసటిరోజు ఉదయం వ్యాపారం చేసేందుకు వచ్చిన ప్రసాద్ తన బడ్డీ అక్కడ లేకపోవడంతో ఉలిక్కిపడ్డాడు. తన బడ్డీకొట్టు ఎవరో దొంగిలించారని తొలుత ఆందోళన చెందాడు. అనంతరం శ్యాంపురం రోడ్డులో రంగప్ప చెరువులో బడ్డీకొట్టూ పడేసి ఉండడంతో తనతో వివాదాలకు దిగుతున్నవారే ఈ పనిచేసిఉంటారని బాధితుడు అనుమానం వ్యక్తంచేస్తూ తన బడ్డీకొట్టు వెనుక ఉన్న వ్యాపారిపై రాజాం పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాడు.
నాలుగు రోజులైనా జరగని న్యాయం
తన వద్ద అన్నిరకాల డాక్యుమెంట్లు ఉన్నాయని, తన బడ్డీని దొంగిలించినవారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అందులో రూ.1 లక్షకుపైగా ఉన్న సరుకులకు డబ్బులు ఇప్పించాలని పోలీసులను కోరాడు. ఈ తంతు జరిగిన నాలుగురోజులు గడిచినా ఇంతవరకూ ప్రసాద్కు న్యాయం జరగలేదు. తాను చిరువ్యాపారిని కావడంతోనే తనకు ఎవరూ మద్దతుగా రావడంలేదని, న్యాయం జరగడంలేదని ప్రసాద్ విలేకరుల ఎదుటవాపోతున్నాడు. బండి లక్ష్మీనారాయణ అనే బడా వ్యాపారే కొంతమంది అధికార పార్టీ నేతల మద్దతుతో బలవంతంగా తన బడ్డీ కొట్టూ తొలగించాడని ఆరోపిస్తున్నాడు. పోలీసులు సైతం తనకు న్యాయం చేయడంలేదని లబోదిబోమంటున్నాడు. ఇదిలా ఉండగా ఈ విషయంపై రాజాం పట్టణ సీఐ అశోక్కుమార్ వద్ద సాక్షి ప్రస్తావించగా, బాధితుడి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, న్యాయం చేస్తామన్నారు.

బడ్డీకొట్టు మాయం..!

బడ్డీకొట్టు మాయం..!