
పీలా వర్సెస్ గండి బాబ్జీ
పెందుర్తి : పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత కుమ్ములాటల మెగా సీరియల్ కొనసాగుతుంది. పార్టీ సమావేశాల్లో టీడీపీలో ఉన్న విబేధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పార్టీ కీలక నాయకులే రోడ్డెక్కి రచ్చకు దిగుతున్నారు. అధికారంలో ఉండడంతో ఆధిపత్యం కోసం చోటామోటా నాయకుల నుంచి నియోజకవర్గంలోని కీలక నేతలు సైతం కీచులాడుకుంటున్నారు. తాజాగా శనివారం పెందుర్తిలో జరిగిన టీడీపీ నియోజకవర్గస్థాయి సంస్థాగత ఎన్నికల సన్నద్ధ సమావేశంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుటే పరస్పరం దూషణలకు దిగారు. ‘పిలుపు’ల విషయంలో ఇద్దరి మధ్య మాటలు తూటాలు పేలాయి.
అసలేం జరిగిందంటే..
పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో పెందుర్తిలో ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న గండి బాబ్జీ దాదాపు 2 గంటలు ఆలస్యంగా సమావేశానికి వచ్చారు. అదే సమయంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, గండి బాబ్జీ చిరకాల ప్రత్యర్థి అయిన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు తన వర్గీయులతో కలిసి సమావేశానికి వచ్చారు. ఈ క్రమంలో గండి బాబ్జీ ప్రసంగిస్తూ ‘నేను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిని. రాష్ట్ర స్థాయిలో ఓ కార్పోరేషన్కు చైర్మన్ హోదాలో ఉన్నాను. కానీ నన్ను నియోజకవర్గ పరిధిలో ఉన్న జీవీఎంసీ వార్డుల్లోని ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. అంతా నువ్వే చేసుకుంటున్నావ్’ అంటూ మేయర్ పీలాను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. దీంతో పీలా వెంటనే మైక్ అందుకుని ‘పెందుర్తి పట్టణం నా అడ్డా. నాకు ఇక్కడ తిరుగులేదు. బండారు సత్యనారాయణమూర్తి లాంటి వ్యక్తే నా అనుమతి లేకుండా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు కాదు. నువ్వు మాత్రం పార్టీ కార్యక్రమాలకు కూడా మేయర్ హోదాలో ఉన్న నన్ను పిలవడం లేదు. అయినా అధికారిక కార్యక్రమాలకు నిన్ను ఎందుకు పిలవాలి’ అంటూ అంతే ఘాటుగా బదులిచ్చారు. ఈ క్రమంలో వేదిక మీద నుంచే పీలా, గండి పరస్పరం మాటలు విరుసుకున్నారు. ఇక పరిస్థితి చేదాటిపోతుందన్న సమయంలో కోరాడ, ఇతర నాయకులు కలగజేసుకుని ఇద్దరినీ సముదాయించారు.
అందుకేనా..
టీడీపీ ఇన్చార్జిగా ఉన్న గండి బాబ్జీపై ప్రత్యర్థుల కంటే స్వపక్షంలోనే ఎక్కువ మంది గిట్టనివారు ఉన్నా రు. జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మేయర్ పీలా శ్రీనివాసరావు అనేకసార్లు గండి బాబ్జీని కౌంటర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బహిరంగంగానే బాబ్జీపై విమర్శలు దిగుతున్నారు. ఈ క్రమంలో శనివారం సమావేశానికి బాబ్జీకి చిరకాల ప్రత్యర్థి అయిన బండారు కుమారుడు అప్పలనాయుడు, ఇతర నాయకులతో పీలా కలిసి రావడం బాబ్జీకి చిర్రెత్తుకొచ్చినట్లు తెలుస్తుంది. అదే సమయంలో బాబ్జీపై చాలాకాలంగా గుర్రుగా ఉన్న పీలా సైతం సందర్భం చూసి విరుచుకుపడ్డారు. మొత్తానికి పెందుర్తి టీడీపీ కుక్కలు చింపిన విస్తరిగా మారిందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
టీడీపీ అంతర్గత సమావేశంలో పరస్పరం దూషించుకున్న మేయర్, టీడీపీ ఇన్చార్జి
నువ్వు నన్ను ఎందుకు కార్యక్రమాలకు పిలవడం లేదని నిలదీసిన గండి
అధికారిక కార్యక్రమాలకు నిన్నెందుకు పిలుస్తానంటూ పీలా కౌంటర్
పెందుర్తిలో కొన్ని కార్యక్రమాలకు
నాకు ఆహ్వానం ఇవ్వడం లేదు: మేయర్
పెందుర్తిలో టీడీపీ కుమ్ములాటలు