
సిఫార్సులతో బదిలీలా?
● సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం ● బదిలీ ప్రక్రియలో పాల్గొనకుండా నిరసన
జగదాంబ: జీవీఎంసీ పరిధిలోని సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఐదేళ్లు దాటిన సచివాలయ మౌలిక సదుపాయాల కార్యదర్శులకు బదిలీ చేయడానికి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలపగా, శనివారం జీవీఎంసీ జోన్–4 సూర్యాబాగ్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ముందుగా చెప్పినట్లు మూడు ఆప్షన్ల ప్రక్రియ కాకుండా, కూటమి నేతల సిఫార్సుల ప్రకారం బదిలీలు జరుగుతున్నాయని సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కూటమి నేతల సిఫార్సులకు అధికారులు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్షన్లో ఇచ్చిన మూడు సచివాలయాల మాట మరచి అధికారులు నేతలకు తొత్తులుగా వ్యవహరించడంతో సీనియర్ కార్యదర్శులకు అన్యాయం జరిగిందని వారు వాపోయారు. బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. పారదర్శకంగా బదిలీలు చేయాలంటూ బదిలీల ప్రక్రియ నుంచి బయటకు వచ్చేశారు.
అర్హులకు అన్యాయం
మరికొందరికి బదిలీ కౌన్సెలింగ్లో ఆప్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుని వెళ్లిపోవాలని సూచించినట్లు చెబుతున్నారు. దీనివల్ల అర్హులైన కార్యదర్శులకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, బదిలీల ప్రక్రియను సక్రమంగా జరిపించాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు.