
జనసేన నుంచి జనసేనలో చేరిక
● ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ సస్పెన్షన్ చేసిన వారంతా ... ● టీడీపీలో కొందరు గండి బాబ్జీ వ్యతిరేకులను జనసేనలో చేర్చుకున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు
పెందుర్తి: జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీలో చేరారు.. షాకయ్యారా..అవ్వకండి.. పెందుర్తి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ఇలాంటి వింతలు మరిన్ని చూడాలి. ఏడాది క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ సస్పెన్షన్కు గురై.. ఎన్నికల్లో జనసేనకు పనిచేసిన నాయకులతో పాటు ఇటీవల టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీకి వ్యతిరేకంగా రాజీనామాలు చేసిన పలువులు కార్యకర్తలను జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇప్పటికే టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీ తనకు పక్కలో బల్లెంలా మారడంతో జనసేన నాయకులనే మళ్లీ అదే పార్టీలో చేర్చుకుని ‘నేనే బలవంతుడిని’ అని చెప్పుకోవడం కోసం రమేష్బాబు వెంపర్లాడుతున్నారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలో ఘోర వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కోంటున్న వేళ.. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బలంగా ముందుకు అడుగులు వేస్తున్న సమయంలో.. ‘వాపు’ని బలం అని చెప్పుకోవడానికి కూటమి ముఖ్య నేతలు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
వారే వీరు..
పెందుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులుగా ఉన్న కొంత మంది సబ్బవరం మండలానికి చెందిన నాయకులు పార్టీ వ్యతిరేక విదానాలకు పాల్పడ్డారు. అందులో అమృతపురం ఎంపీటీసీ సభ్యుడు సింగంపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురిని వైఎస్సార్సీపీ 2024 ఎన్నికల ముందే సస్పెండ్ చేసింది. దీంతో వారంతా జనసేన జెండాలు పట్టుకుని తిరిగారు. వారితో పాటు నారపాడు ఎంపీటీసీ, సబ్బవరం–2 ఎంపీటీసీ బైలపూడి దేముడుబాబు, సబ్బవరం–3 ఎంపీటీసీ సబ్బవరపు శ్రీను తదితర నాయకులు కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పంచన చేరారు. శనివారం సబ్బవరంలో జరిగిన కార్యక్రమంలో వారందరికీ మళ్లీ కండువాలు వేసి జనసేనలో చేర్చుకోవడంతో సభకు హాజరైనవారే అవాక్కయ్యారు.