కొంచెం సులభమే! | Students express satisfaction over first day of JEE Main exam | Sakshi
Sakshi News home page

కొంచెం సులభమే!

Apr 3 2025 5:30 AM | Updated on Apr 3 2025 5:30 AM

Students express satisfaction over first day of JEE Main exam

సాక్షి, ఎడ్యుకేషన్‌: జేఈఈ మెయిన్‌ – 2025 రెండో దశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తంచేశారు. ఈసారి అడిగిన ప్రశ్నల్లో భిన్నత్వం కనిపించిందని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. మొదటి సెషన్‌లో రసాయనశాస్త్ర ప్రశ్నలు తేలికగా ఉంటే, ఈసారి కఠినమైన ప్రశ్నలు వచ్చా యని తెలిపారు. 

న్యూమరికల్‌ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సమయం సరిపోలేదని కొందరు విద్యార్థులు చెప్పారు. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లోంచి ప్రశ్నలను ట్విస్ట్‌ చేస్తూ ఇచ్చినట్టు నిపుణులు వెల్లడించారు. సాధారణంగా ఫిజిక్స్‌లో మధ్యస్తంగా స్కోర్‌ చేసేందుకు అవకాశం ఉండేది. ఈసారి కెమిస్ట్రీతో పోలిస్తే ఫిజిక్స్‌ విభాగంలో కొంత సులభమైన ప్రశ్నలున్నట్టు సబ్జెక్ట్‌ నిపుణులు తెలిపారు. గణితంలో ఈసారి సుదీర్ఘ ప్రశ్నలు కొంత తగ్గినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. 

ఈ విభాగంలో లాగరిథమ్స్, క్వాడ్రాట్రిక్‌ ఈక్వేషన్స్, సీక్వెన్స్‌ అండ్‌ సిరీస్‌ల నుంచి వచ్చిన ప్రశ్నలకు తేలికగానే సమాధానాలు రాబట్టినట్టు పలువురు విద్యార్థులు తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది రాస్తున్న ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది వరకు హాజరవుతున్నారు. బుధవారమే సీబీఎస్‌ఈ పరీక్ష కూడా ఉండటంతో, రెండూ ఎలా రాస్తారనే అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఎన్‌టీఏ సీబీఎస్‌ఈ పరీక్ష ఉన్న విద్యార్థుల స్లాట్‌ సమయాన్ని మార్చింది. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ వెసులుబాటు కల్పించింది. 

సబ్జెక్టులవారీగా ఇలా.. 
– మొదటి షిఫ్ట్‌ ప్రశ్నపత్రం ఓ మోస్తరు క్లిష్టతతో ఉందని, ఫిజిక్స్‌ విభాగం క్లిష్టంగా, మ్యాథమెటిక్స్‌ విభాగంలో ప్రశ్నలు సుదీర్ఘంగా, మిగతా రెండు విభాగాలతో పోల్చితే కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు.  
– ఫిజిక్స్‌లో మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, ఆప్టిక్స్‌ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. న్యుమరికల్‌ ప్రశ్నల కారణంగా సమయం సరిపోలేదని కొందరు విద్యార్థులు తెలిపారు. రెండో షిఫ్ట్‌లో ఓ మోస్తరు కఠినమైన ప్రశ్నలు అడిగారు. మోడ్రన్‌ ఫిజిక్స్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్, మ్యాగ్నటిక్‌ ఫీల్డ్, యూనిట్‌ అండ్‌ డైమెన్షన్స్, రొటేషన్, ఫ్లూయిడ్‌ మెకానిక్స్, సర్ఫేస్‌ టెన్షన్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్, లాజిక్‌ గేట్, కైనమాటిక్స్‌ అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. 

– జనవరి సెషన్‌తో పోల్చితే కెమిస్ట్రీలో ఈసారి ఓ మోస్తరు క్లిష్టతతో ప్రశ్నలడిగారని అంటున్నారు. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ కంటే ఇనార్గానిక్, ఫిజికల్‌ కెమిస్ట్రీ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కూడా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోంచి నేరుగా అడిగారు. రెండో షిఫ్ట్‌లో కూడా ఇదే తరహాలో ప్రశ్నలు అడిగారు. ఫిజికల్‌ కెమిస్ట్రీలో న్యుమరికల్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి. మొదటి షిఫ్ట్‌ మాదిరిగానే రెండో షిఫ్ట్‌లో కూడా ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. 

– మ్యాథమెటిక్స్‌ విభాగంలో జనవరి సెషన్‌తో పోల్చితే ఈసారి ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని, 5 ప్రశ్నలు డైరెక్ట్‌ ఫార్ములా ఆధారంగా అడిగారని చెబుతున్నారు. రెండో షిఫ్ట్‌లో కూడా ఈ విభాగం ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. వెక్టార్‌ అండ్‌ 3డి, మ్యాట్రిసెస్, డిటరి్మనెంట్స్, లీనియర్‌ ఈక్వేషన్స్, ఇంటిగ్రేషన్, కానిక్‌ సెక్షన్, ఎలిప్స్, ఏరియా అండర్‌ కర్వ్, ప్రాబబిలిటీలకు రెండో షిఫ్ట్‌లో ప్రాధాన్యం లభించింది. మొదటి షిఫ్ట్‌లో మాత్రం అధిక శాతం ప్రశ్నలు పెర్ముటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్, బైనామియల్స్, సర్కిల్స్, లాగరిథమ్స్, క్వాడ్రాట్రిక్‌ ఈక్వేషన్స్, సీక్వెన్స్‌ అండ్‌ సిరీస్‌ల నుంచి అడిగారు. 

గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా.. 
రెండో సెషన్‌లో మొదటి రోజు పరీక్షల్లో అధిక శాతం ప్రశ్నలు.. గత ప్రశ్న పత్రాల నుంచే అడిగారు. వీటిని బాగా ప్రాక్టీస్‌ చేసిన వారు ఎక్కువ సమాధానాలు గుర్తించే అవకాశం ఉంది. ఫార్ములాలు, కాన్సెప్‌్టలపై అవగాహన ఉన్నవారు కూడా సమాధానాలు ఇచ్చేలా ప్రశ్నలున్నాయి. కెమిస్ట్రీలో మిక్స్‌డ్‌ కాన్సెప్ట్‌ కొశ్చన్స్‌ అడిగారు. మ్యాథమెటిక్స్‌లో 52–56 మార్కులు; ఫిజిక్స్‌లో 75–85 మార్కులు; కెమిస్ట్రీలో 60–65 మార్కులతో 99 పర్సంటైల్‌ పొందే అవకాశం ఉంది.  
– ఎం.ఎన్‌. రావు, జేఈఈ శిక్షణ నిపుణుడు. 

Advertisement
 
Advertisement
Advertisement