Telangana: ‘టెన్త్‌’కు కఠిన పరీక్ష!

SSC Board thinking about Tenth exams pattern Telangana - Sakshi

చాయిస్‌ తగ్గింది.. ప్రశ్నల స్థాయి మించింది.. 

మోడల్‌ పేపర్‌ను బట్టి చూస్తే సిలబస్‌ క్లిష్టతరం 

విరామం లేకుండా వరుసగా పరీక్షలు పెట్టడం అశాస్త్రీయం.. ఇలాగైతే విద్యార్థులకు కష్టమేనంటున్న ఉపాధ్యాయులు 

ఉత్తీర్ణత శాతం తగ్గిపోతుందని ఆందోళన 

తక్షణమే మార్పులు చేయాలని డిమాండ్‌ 

పరీక్ష విధానంపై ఆలోచనలో ఎస్సెస్సీ బోర్డు

‘పరీక్షల’పై ప్రశ్నలు, ఆందోళనలివీ.. 
► టెన్త్‌ పరీక్షల్లో గతంలో ఇచ్చినట్టుగా ఈసారి రెండు, మూడు మార్కు­ల సూక్ష్మ ప్రశ్నలకు చా­యిస్‌ ఇవ్వలేదు. ఆరు చొప్పు­న ప్రశ్నలిచ్చి అన్నీ రాయాలన్నారు. ఏ ఒక్క ప్రశ్న తెలియకపోయినా విద్యార్థి ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. అన్ని చాప్టర్లపై పట్టులేనప్పుడు దీనితో చాలా నష్టం.  

► వ్యాసరూప ప్రశ్నల తీరును కఠినం చేశారు. సెక్షన్‌ మాదిరి కాకుండా, గ్రూపు మాదిరి చాయిస్‌ ఇవ్వడం విద్యార్థులకు ఇబ్బందేనని నిపుణులు చెప్తున్నారు. సెక్షన్‌ మాదిరిగా అంటే మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చి అందులోంచి ఆరింటికి సమాధానాలు రాయాలి. దీనిలో విద్యార్థులకు చాయిస్‌ ఎక్కువగా ఉండి, ఎక్కువ స్కోర్‌ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఒక్కో గ్రూప్‌లో రెండు ప్రశ్నల చొప్పున ఆరు గ్రూపులుగా ప్రశ్నలు ఇచ్చారు. ప్రతి గ్రూప్‌లోని రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయాలి. ఆ రెండింటికి సమాధానం తెలియకపోతే.. ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. మిగతా గ్రూపుల్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగినా ప్రయోజనం ఉండదు. 

► పరీక్ష సమయం మొత్తం 3 గంటలు.. ఇందులో ఆరు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికే రెండు గంటల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ముందే మిగతా ప్రశ్నలకు జవాబులు రాస్తే.. వ్యాసరూప ప్రశ్నలకు సమ­యం సరిపోదని అంటున్నారు. అందువల్ల వ్యా­స­రూప ప్రశ్నలను నాలుగుకు తగ్గించాలని సూచిస్తున్నారు. 

► సైన్స్‌ సబ్జెక్టులో ఫిజిక్స్‌/కెమిస్ట్రీ ఒకటి.. బయాలజీ మరొకటిగా పేపర్లు ఉంటాయి. రెండింటి ప్రిపరేషన్‌ వేర్వేరుగా ఉంటుంది. వీటన్నింటినీ ఒకేరోజు, ఒకే సమయంలో పెట్టడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

ప్రశ్నపత్రంలో చాయిస్‌ పెంచాలి 
ప్రశ్నపత్రంలో జవా­బుల చాయిస్‌ పెంచాలి. అన్ని విభాగాల్లో కనీసం 30 శాతమైనా ఇవ్వాలి. విరామం లేకుండా పరీక్షల నిర్వహణ అశాస్త్రీయం. తక్షణమే పరీక్షల తీరుపై అధికారులు సమీక్షించాలి. 
– రాజా భానుచంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు 

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సెస్సీ పరీక్షల చుట్టూ వివాదం ముసురుతోంది. పరీక్ష విధానం, నిర్వహణ, సిలబస్, చాయిస్‌లలో చేసిన మార్పులపై పునః సమీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. పరీక్షలకు సంబంధించిన మోడల్‌ పేపర్లను పరిశీలించిన ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ అభ్యంతరాలు తెలిపాయి.

తమ సూచనలను పరిగణనలోకి తీసుకోకుంటే.. విద్యార్థులకు ఇబ్బంది తప్పదని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ అంశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుండటంతో.. విద్యాశాఖ ఉన్నతాధికారులు డోలాయమానంలో పడ్డారు. 

మోడల్‌ పేపర్లను చూసి.. 
ఇటీవల టెన్త్‌ పరీక్షల టైం టేబుల్‌ విడుదల చేసిన ఎస్సెస్సీ బోర్డు పరీక్షల మోడల్‌ పేపర్లనూ ఆన్‌లైన్‌లో పెట్టింది. ఈ మోడల్‌ పేపర్లను బట్టి పరీక్ష విధానం కఠినంగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు నిర్ధారణకు వచ్చాయి. అసలే కోవిడ్‌ వల్ల రెండేళ్లుగా అభ్యసన నష్టాలు ఉన్నప్పుడు పరీక్షను కఠినతరం చేస్తే విద్యార్థులకు నష్టమని అంటున్నాయి.

టెన్త్‌ పరీక్షలు రాయబోయే దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల్లో.. 2 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లవారు ఉంటారని.. వీరిలో 1.2 లక్షల మంది కనీస స్థాయిలో, మరో 45 వేల మంది అంతకన్నా తక్కువగా సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నట్టు ఇటీవలి అంచనాల్లో వెల్లడైందని పేర్కొంటున్నాయి. కోవిడ్‌ పరిణామాలతో ప్రైవేటు విద్యార్థుల్లోనూ ప్రమాణాలు తగ్గాయని.. ఇలాంటప్పుడు క్లిష్టమైన ప్రశ్నలు, సంక్లిష్టమైన సమాధాన రూపం ఉండటం సరికాదని స్పష్టం చేస్తున్నాయి. 

గ్యాప్‌ ఇవ్వాల్సిందే.. 
సీబీఎస్‌సీ సిలబస్‌తో కొనసాగే కేంద్ర విద్యాసంస్థల్లో ప్రతీ పరీక్షకు మధ్య సన్నద్ధతకు సెలవు ఉంటుంది. మన రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డ్‌ మాత్రం ఈ విధానాన్ని పాటించ లేదు. ప్రభుత్వ సెలవు దినాలు మినహా ప్రతీ సబ్జెక్టు పరీక్షల మధ్య విరామం ఇవ్వలేదు. ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లుగా పరీక్షలు (40 మార్కుల చొప్పున) నిర్వహించినప్పుడు మధ్యలో ఒకరోజు విరామం ఇచ్చారు.

ఇప్పుడు మొత్తం 80 మార్కులతో ఒకే పరీక్ష నిర్వహించనున్నా మధ్యలో విరామం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ విషయాన్ని విద్యామంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. కోవిడ్‌ నష్టాలున్న కాలం కాబట్టి విరామం, ఇతర వెసులుబాట్లు అమలు చేయాలని కోరినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. 

చాయిస్‌ పెంచాలి.. 
ఒకే పేపర్‌గా పరీక్ష నిర్వహిస్తుండటం వల్ల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. ప్రశ్నపత్రంలోని ఒకటి, రెండు సెక్షన్లలో కూడా చాయిస్‌ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 2 మార్కులు, 3 మార్కుల ప్రశ్నలకు కనీసం 30శాతం చాయిస్‌ ఇవ్వాలని అంటున్నారు. మూడో సెక్షన్‌లో వ్యాస రూప ప్రశ్నలను తగ్గించాలని.. ఫిజిక్స్‌/కెమిస్ట్రీ, బయాలజీ పరీక్షలు ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని సూచిస్తున్నారు.

ఎస్సెస్సీ బోర్డు ఈ సూచనలు పాటించకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ముందుగా బోధన ప్రారంభం కావడం, రివిజన్‌ రెండు సార్లు చేయడం వల్ల తేలికగా పరీక్షలు రాసే వీలు ఉందని అంటున్నారు. అదే ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికీ సిలబస్‌ పూర్తి కాలేదని, ఉపాధ్యాయుల కొరత ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు.

పరీక్షల తీరులో మార్పులు చేయాలి 
రెండేళ్లుగా కోవిడ్‌ వల్ల తరగతులే సరిగా జరగలేదు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రశ్నపత్రాలు ఉంటే మంచిది. కానీ మోడల్‌ పేపర్లు చూస్తే చాలా కఠి నంగా ఉన్నాయి. పరీక్షలపై సంఘాల నేతలతో కలిసి చర్చించి, మార్పులు చేయాలి. 
– చావా రవి, టీఎస్‌ యూటీఎఫ్‌ 

వ్యాస రూప ప్రశ్నలు తగ్గించాలి 
మోడల్‌ పేపర్లను బట్టి చూస్తే వ్యాస రూప ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. వాటిని తగ్గించాలి. భౌతిక, రసాయన శాస్త్రాలు.. జీవశాస్త్రం పేపర్లను ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలి. 
– బీరెల్లి కమలాకర్‌రావు, పీఆర్‌టీయూటీఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top