
విరాహత్ అలీ , బసవ పున్నయ్య
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ దినపత్రికపై పథకం ప్రకారమే ఏపీలోని కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. ఆయన శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఇలాంటి కుట్ర లు ఈ ఒక్కసారే కాదు.. ప్రతిసారీ ఏదో విధంగా వేధిస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్య విలువలను హరిస్తున్నారు.
అందుకు ఉదాహరణ ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసులు పెట్టడమే’ అని పేర్కొన్నారు. దీన్ని తాము సీరియస్గా పరిగణిస్తున్నామని, ఏదో సాకుతో కేసులు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇ లాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. ‘సాక్షి’కి, జర్నలిస్టులకు బాసటగా నిలబడతామని అంటూ, రాజ్యాంగంపై చంద్రబాబుకు ఏ మాత్రం గౌరవం, విశ్వాసం ఉన్నా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలి
ఏపీ కూటమి ప్రభుత్వంపై వార్తలు రాస్తోందని సాక్షి పత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం సరైంది కాదని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఒక ప్రకటనలో ఖండించారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకో వాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా కు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడం సరికాదన్నారు. వార్తలు, కథనాలు, ప్రసారాలపై అభ్యంతరాలుంటే ప్రెస్కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా ‘సాక్షి’పై పదేపదే కేసులు పెట్టడం దారుణమని ఆయన అన్నారు.
ఎడిటర్కు నోటీసులు.. మీడియా స్వేచ్ఛను హరించడమే..
ప్రచురితం చేసిన వార్తా కథనాలకు సంబంధించి ఆధారాలు వెల్లడించాలంటూ ఎడిటర్పై పోలీసులు ఒత్తిడి చేయడం, నోటీసులు జారీచేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(హెచ్ 143) ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎడిటర్ ధనంజయరెడ్డికి పలుమార్లు నోటీసులు జారీ చేయడం, ప్రచురితమైన వార్తలకు సంబంధించి సోర్స్ను బహిర్గతపరచాలని హుకుం జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి చర్యల్ని జర్నలిస్టు సంఘాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు.