ఆర్థిక సంవత్సరం తొలి నెలలో రూ.6,900 కోట్ల రుణం తీసుకున్న రాష్ట్రం
ఆర్బీఐ ద్వారా బాండ్ల వేలంతో నేడు మరో మారు రుణ సేకరణ
సాక్షి, హైదరాబాద్: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా బహిరంగ మార్కెట్లో బాండ్లను వేలం వేసి, రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణ సేకరణకు సిద్ధమైంది. ఆర్బీఐ షెడ్యూల్ ప్రకారం మంగళవారం ప్రభుత్వం రూ.4 వేల కోట్ల అప్పు తీసుకోనుంది. 30 ఏళ్ల కాలపరిమితితో 8.07 శాతం వడ్డీ చెల్లించే విధంగా రూ.2 వేల కోట్లు, 16 ఏళ్ల కాలపరిమితితో 7.97 శాతం వడ్డీ చెల్లించేలా మరో రూ.2 వేల కోట్లను ప్రభుత్వం తీసుకోనుంది.
దీంతో గత నెలలో చేసిన రూ.6,900 కోట్ల అప్పుతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో తీసుకునే రుణాల మొత్తం రూ.10,900 కోట్లకు చేరనుంది. ఏప్రిల్ నెల ఏడో తేదీన రూ.3,900 కోట్లు, అదే నెల 21న రూ.3 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంది. ఇప్పుడు మరో రూ.4 వేల కోట్లను తీసుకోనుంది. దీంతో పాటు ఈ నెల, వచ్చే నెల కలిపి మరో రూ.5,500 కోట్ల రుణం తీసుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆర్బీఐకి షెడ్యూల్ ఇవ్వడం గమనార్హం.


