బడికి టాటా.. 50 రోజుల ఆట | 50 Vacation Activities For Students In Summer | Sakshi
Sakshi News home page

బడికి టాటా.. 50 రోజుల ఆట

Apr 26 2025 4:20 AM | Updated on Apr 26 2025 4:20 AM

50 Vacation Activities For Students In Summer

వేసవి సెలవులతో ఇక విద్యార్థుల సందడే సందడి 

ఆటపాటలతో ఆరోగ్యం..  స్నేహబంధం మరింతగా అల్లుకొనేందుకు అవకాశం 

వినోదాల పేరిట పిల్లలు దారి తప్పకుండా తల్లిదండ్రులు చూసుకోవాలంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: పరీక్షా కాలం ముగిసింది.. చదువుల ఒత్తిడి నుంచి పిల్లలకు విరామం లభించింది.. బడులకు టాటా చెప్పి ఆటపాటలతో సేదతీరే వేళయింది. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో దాదాపు 50 రోజులపాటు సందడే సందడి నెలకొననుంది. అయితే వినోదాల పేరిట పిల్లలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ దారితప్పకుండా తల్లిదండ్రులు ఇప్పుడే దృష్టి పెట్టాలని.. వారు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని.. అవసరమైన మార్గదర్శనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళిక రచించాలంటున్నారు. కాసేపు టీవీలు చూడనిచ్చినా కుటుంబ సభ్యులంతా కలిసి ఆడుకొనే ఆటలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.

ఆన్‌లైన్‌కు బానిసలు కానివ్వొద్దు
పట్టణాలు, నగరాల్లో పిల్లలకు ఆటస్థలాల కొరత వల్ల చాలా మంది సెల్‌ఫోన్లు, ఆన్‌లైన్‌ ఆటలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల 50 రోజుల్లో వారి మానసిక ధోరణిలో మార్పులొస్తాయని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త అంజలా గౌరీ తెలిపారు. ఈ విధానం వల్ల రెండేళ్లలో మెదడు మొద్దుబారి విచిత్ర ధోరణి ప్రదర్శించిన 28 మందికి కౌన్సెలింగ్‌ ఇచి్చనట్లు చెప్పారు. రేయింబవళ్లు సెల్‌ఫోన్లకు పరిమితమవడం నిద్రలేమికి దారితీస్తుందని.. ఫలితంగా వారి మానసిక ధోరణిలో మార్పులొస్తాయని హైదరాబాద్‌కు చెందిన మానసిక నిపుణులు అరోరీ వాగ్దేవి తెలిపారు. గతేడాది వేసవి సెలవుల్లో తన కుమారుడు అదేపనిగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటం వల్ల తిరిగి స్కూల్‌ తెరిచాక ఏడాదంతా పాఠ్యపుస్తకాలు చదవాలంటే ఒక రకమైన భయం పట్టుకుందని కూకట్‌పల్లికి చెందిన ఓ విద్యార్థి తల్లి పేర్కొన్నారు.

బంధాల వైపు మళ్లించాలి 
పిల్లలకు అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లలో గడిపే అవకాశం ఇవ్వడం వల్ల సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటంతోపాటు పొడుపు కథల వంటివి వారి నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలుగు భాషపై వరంగల్‌ స్కాలర్‌ వినీత్‌ భార్గవ్‌ జరిపిన పరిశోధనలో వెలుగులోకి వచి్చంది. నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మల అనుభవాల్లోంచి కథలు నేర్చుకొనే పిల్లల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని.. 100 మందిలో 82 మంది తరగతి గదుల్లోనూ చురుకుగా వ్యవహరించిన తీరును గుర్తించామని ఆయన పేర్కొన్నారు.

దీంతోపాటు గ్రామీణ అనుబంధాలు, బంధువులతో మమేకమైనప్పుడు కలిగే అనుభూతులు విద్యార్థుల మానసిక ధోరణిలో మార్పు తెస్తున్నాయన్నారు. అనుబంధాలు పెంచుకొనే పిల్లల మానసిక ధోరణి ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటోందని భారత సైకాలజీ అసోసియేషన్‌ జరిపిన ఓ పరిశోధన తేల్చింది. 468 మందిపై అసోసియన్‌ ఆన్‌లైన్‌ సర్వే చేపట్టింది. ఎవరికి ఎవరు అనే ధోరణి నుంచి బయటపడిన పిల్లల్లో 332 మంది వేసవి సెలవుల్లో పెద్దవాళ్ల దగ్గర నేర్చుకున్న జ్ఞానమేనని తేలింది.

జాగ్రత్తగా వ్యాయామం
ఆట విడుపులో భాగంగా పిల్లలు నిత్యం క్రికెట్, కబడ్డీ లాంటి రకరకాల క్రీడలు ఆడుతుంటారు. దీనివల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా బలపడతారని వ్యాయామ కళాశాలలో విశేష అనుభవం ఉన్న జీవీవీ సత్యనారాయణ తెలిపారు. ఆటలతో స్నేహాలు మరింత మెరుగవుతాయని.. కొత్త స్నేహాలను చిగురింపజేస్తాయని పేర్కొన్నారు.

అయితే ఈ క్రమంలో పిల్లలు ఘర్షణలు, విభేదాల వైపు మళ్లకుండా మార్గదర్శకుల పర్యవేక్షణలో వారు ఆటలు ఆడేందుకు వీలున్న గ్రౌండ్లకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్తూ సేదతీరుతుంటారు. అయితే ఇందులో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఇలాంటి ఘటనల్లో తీవ్రంగా గాయపడగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.

వేసవి సెలవుల్లో పిల్లల్ని ఖాళీగా వదిలేస్తే ఫోన్లు, టీవీలకు అతుక్కుపోవడమో లేదా ఎండలో స్నేహితులతో తిరగడమో చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలకు నీతికథలు చెప్పాలి. గ్రామాల్లో ఇరుగుపొరుగు పిల్లలందరినీ ఒకచోట కూర్చోబెట్టి వారికి లోకజ్ఞానం నేరి్పంచే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పిల్లలు కూడా ఇవే కోరుకుంటున్నారు. బోర్‌గా ఫీలవ్వడం లేదు. – కాకి వీరభద్రం, వనం వారి కృష్ణాపురం, ఖమ్మం జిల్లా

⇒  కృత్రిమ మేధ (ఏఐ) గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పిల్లల్లో పెరిగింది. దాని గురించి నేర్పడానికి ఇదే మంచి తరుణం. వేసవిలో వారితో కూర్చొని ఏఐపై కసరత్తు చేస్తే పిల్లలు బోర్‌గా ఫీలవ్వరు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా మోటివేషన్‌ బాగా పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్దలు చొరవ తీసుకొని ఆన్‌లైన్‌లో ఏఐపై శిక్షణ ఇప్పించాలి. – కంకిపాటి శేషుకుమార్, హైదరాబాద్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement