తమిళసినిమా: నటి సాక్షీ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం థియేటర్ కూట్టం. రూల్ బ్రేకర్స్ ప్రొడక్షన్, దియా సినీ క్రియేషన్స్ అధినేతలు జగన్ నారాయణన్, శక్తివేల్, వీరమణి, కన్నన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. డేనియల్ అణిపోప్, వైయాపురి, శ్యామ్స్, వసంతి, జస్పర్, సత్య, సంయుక్త తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శక్తివేల్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇసైపేట్టై సంగీతాన్ని, ప్రశాంత్ ఎఫ్టీ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ప్రముఖ సంగీతదర్శకుడు దేవా ఆవిష్కరించి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ క్రైమ్, థ్రిల్లర్ జానర్లో సాగే ఈ చిత్ర కథ ఒక్క రోజులో జరిగేదిగా ఉంటుదన్నారు. ఒక ఇంటిలో జరిగిన హత్యలో చిక్కుకున్న ముగ్గురు యువకులు ఎదుర్కొనే సమస్యలు, అందులోంచి వారు ఎలా బయట పడ్డారు ? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే క్రైమ్,థ్రిల్లర్ కథా చిత్రంగా థియేటర్ కూట్టం ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందనీ, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను వరుసగా వెల్లడిస్తామని చెప్పారు.


