తెలుగులో అన్నాడీఎంకే
అభ్యర్థి ప్రచారం
పళ్లిపట్టు: తిరుత్తణి అన్నాడీఎంకే అభ్యర్థి హరి పళ్లిపట్టు ప్రాంతంలోని తెలుగు గ్రామాల్లో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలుగులో ప్రచారం నిర్వహించి ఆకట్టుకున్నారు. తిరుత్తణి నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరి పళ్లిపట్టు యూనియన్లోని కరింబేడు, సామంతవాడ, వడకుప్పం, తిరుమలరాజుపేట, వెలిగరం సహా పదికి పైగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకం 150 రోజులకు పెంచుతామని, అలాగే మహిళలకు ఆర్థికసాయం రూ.2వేలు అందజేస్తామన్నారు. వృద్ధులకు పింఛన్ రూ.2వేలు వేలు, ఇంటింటికి ఫ్రిడ్జ్ అందిస్తామని, అన్నాడీఎంకేను గెలిపించాలని కోరారు. ప్రజలు కోర్కె మేరకు హరి తెలుగులో ప్రచారం చేసి ఆకట్టుకున్నారు. ప్రచారంలో అన్నాడీఎంకే యూనియన్ కార్యదర్శులు టీటీ.శ్రీనివాసన్, కృష్ణమనాయుడు, రవి, మాజీ పంచాయతీ సర్పంచ్ చంద్రబాబు పాల్గొన్నారు.
జీతమంతా ప్రజాసేవకే
వినియోగించా!
కొరుక్కుపేట: గత ఐదేళ్లుగా తన ఎమ్మెల్యే జీతమంతా ప్రజాసేవకే వినియోగించానని విరుగంబాక్కంఅభ్యర్థి ప్రభాకర్ రాజా అన్నారు. ఎమ్మెల్యే ఏఎంవీ ప్రభాకర్రాజా డీఎంకే తరఫున విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సోమవారం తన నామినేషన్ను దాఖలు చేశారు . అనంతరం ప్రభాకర్రాజా మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తన ఎమ్మెల్యే జీతం మొత్తం ప్రజా సేవకే ఖర్చు పెట్టానని అన్నారు. విరుగంబాక్కం నియోజక వర్గంలో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యా ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నానని తెలిపారు. నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే ఉదయసూర్యుడు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
అన్నాడీఎంకే ఇంటింటి ప్రచారం
తిరువొత్తియూరు: రాయపురం నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి డి.జయకుమార్ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఆయనకు ఓట ర్లు దారి పొడవునా స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో జయకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు అన్నాడీఎంకేను గెలిపిస్తే రాయపురాన్ని చేస్తానని అన్నారు. రాయపురం నియోజకవర్గ అభివృద్ధికి అన్నాడీఎంకేను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఎన్నికల ఖర్చు కోసం శశికళ
రూ.52 లక్షలు ఇచ్చారు!
–నీటకోట్టై అభ్యర్థి అన్భళగన్
కొరుక్కుపేట: ఎన్నికల ఖర్చుల కోసం శశికళ తనకు మొత్తం రూ.52 లక్షలు ఇచ్చారని దిండుగల్ జిల్లా నీలకోట్టై అభ్యర్థి అన్భళగన్ తెలిపారు. ఇది బహిరంగంగా చెపట్టంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. వివరాలు.. నీటకోట్టై నియోజక వర్గానికి చెందిన అన్భళగన్ గత 2001 ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున నీటకోట్టై నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీలో తనకు ఎలాంటి పదవులు ఇవ్వకపోవటంతో ఆయన బీజేపీలో చేరారు . నీటకోట్టైలో ఎమ్మెల్యే సీటు తనకు ఖచ్చితంగా వస్తుందనే ఆశతో ఆయన ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పనిచేశారు. కానీ దిండిగల్ మాజీ అన్నాడీఎంకే మంత్రి శ్రీనివాసన్ కూడా ఆ ఆలోచనకు తెరదించారు. దీంతో బీజేపీని వీడి కొత్తగా ఏర్పడిన ఆల్ ఇండియా ఎంజీఆర్ మక్కల్ కళగం (ఏఐఎంఎంకే)లో చేరారు. మరుసటి రోజు ఆయనను నీలకోట్టై నియోజక వర్గం అభ్యర్థిగా ప్రకటించారు . ఈనేపథ్యంలో సోమవారం నీటకోట్టైలో పార్టీ అభ్యర్థి పరిచయ , కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమయంలో అన్భళగన్ మాట్లాడుతూ 2001 ఎన్నికల్లో నీటకోట్టై నియోజక వర్గం నుంచి అన్నాడిఎంకే అభ్యర్థిగాపోటీ చేసినప్పడు రూ.50 లక్షల ఎన్నికల ఖర్చుకోసం ఇచ్చారు. ప్రస్తుతం రూ.2 లక్షలు ఇచ్చారని ఇచ్చారని . మొత్తంరూ.52 లక్షలు ఇచ్చారని అభ్యర్థి చేసిన బహిరంగ ప్రకటన పెద్ద కుదుపును సృష్టించింది. డబ్బు తీసుకున్న ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని , ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని ఈవిషయంలో ఎన్నికల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవా లని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
కారు దగ్ధం
తిరువొత్తియూరు: కొడైకెనాల్కు పర్యటనకు వెళ్లిన కారుకు మంటలు వ్యాపించాయి. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. శివగంగై నుంచి మహిళలు, పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కారులో కొడైకెనాల్కు వత్తలగుండు ప్రధాన కొండ రహదారిపై వెళుతున్నారు. నందన్కరై సమీపంలోకి రాగానే హఠాత్తుగా కారు ముందు భాగం నుంచి పొగలు వచ్చాయి. వెంటనే వాహనంలో వున్న వారంతా అప్రమత్తమై కిందికి దిగేశారు. వెంటనే ఒక్కసారిగా మంటలు వ్యాపించి కారు దగ్ధమైంది. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ జరిపారు. విచారణలో వాహనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది.


