వేలూరు: వేలూరు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో వివిధ కూటమి పార్టీలకు చెందిన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు మొత్తం 116 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన మంగళవారం ఉదయం ప్రారంభమైంది. దీంతో ఆయా అసెంబ్లీ స్థానాల్లోని తాలుకా కార్యాలయంలో నామినేషన్లను ఆయా నియోజక వర్గాల ఎన్నికల అధికారులు పరిశీలించారు. దీంతో నామినేషన్లు దాఖలు చేసిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. వేలూరు నియోజకవర్గంలో 25 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో ఆరుగురి నామినేషన్లు తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అదేవిధంగా కాట్పాడి నియోజక వర్గంలో మొత్తం 25 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఐదుగురి నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. అదేవిధంగా కేవీ కుప్పం నియోజకవర్గంలో మొత్తం 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు, గుడియాత్తంలో 21 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అనకట్టు నియోజక వర్గంలో మొత్తం 22 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 9వ తేదీలోపు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని అధికారులు తెలిపారు.


