
తమిళ భాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
మద్యం తాగితే స్తంభానికి కట్టేయాలి
వేలూరు: విద్యార్థులు తమిళభాషకు అధిక ప్రాదాన్యత ఇవ్వాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్సలర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు కంభన్ కయగం ఆధ్వర్యంలో కవి కన్నదాసన్ జయంతి కార్యక్రమం వేలూరులోని ఊరీస్ కళాశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలూరు కంభన్ కయగం చైర్మన్, వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం అధ్యక్షత వహించారు. చాన్సలర్ మాట్లాడుతూ తమిళ భాషకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలను గుర్తించి ప్రతి సంవత్సరం సమావేశం ఏర్పాటు చేసి అభినందిస్తున్నామన్నారు. చైర్మన్ జీవీ సెల్వం మాట్లాడుతూ తమిళ భాషను పది కోట్ల మంది ప్రజలు మాట్లాడుతున్నప్పటికీ నేటి యుగంలో తమిళం మాట్లాడే వారి సంఖ్య తగ్గుతూనే ఉందన్నారు. ఇందుకు కారణం నేటి విద్యార్థులు పత్రికలు, తమిళ భాష పుస్తకాలు చదవక పోవడమే కారణమన్నారు. తమిళ భాష మాట్లాడటం అనేది అవమానం కాదని, మన గుర్తింపుగా భావించాలన్నారు. నేడు మనం ఆంగ్లభాషకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, తమిళభాషను మరిచి పోతున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తమిళ భాషను మన తరాలు మరిచి పోయే పరిస్థితి ఉందన్నారు. మాతృభాషా దినోత్సవం జరుపుకునే సంప్రదాయం తమిళులకు లేదన్నారు. ప్రతి ఒక్కరూ తమిళ భాషను చదవాలన్నారు. తమిళ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కంభన్ కయగం ఆధ్వర్యంలో కన్నదాసన్ జయంతి ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. అనంతరం తమిళ కవులు, రచయితలను అభినందించారు. ఈ కార్యక్రమంలో రచయితలు జ్యోతి బాలు, వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జ్ఞానవేల్, కంభన్ కయగం కార్యదర్శి చోళనాథన్, కోశాధికారి తిరునావకరసు, తమిళ సంఘం రచయితలు, కవులు, తమిళ పండిట్లు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
వృద్ధురాలి చైన్, నగదు చోరీ
తిరువొత్తియూరు: ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో వృద్ధురాలి చైన్, నగదు చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. చైన్నె, కొట్టివాక్కం ప్రాంతానికి చెందిన రాజేశ్వరి (62) వేపేరిలో వెటర్నరీ ఆస్పత్రిలో అకౌంట్టెంట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఈమె శుక్రవారం తిరువాన్మియూర్ నుంచి షేర్ ఆటోలో కొట్టివాక్కమ్కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో ఆటోలో పక్కన కూర్చుని ఉన్న మహిళ, రాజేశ్వరితో మీ మెడలో ఉన్న చైన్ తెగిపోయేలా ఉందని, దాన్ని మీ బ్యాగులో భద్రంగా ఉంచుకోండని చెప్పింది. తరువాత ఆ మహిళ రాజేశ్వరి చైన్ తీసి బ్యాగులో పెట్టడానికి సహాయం చేసింది. రాజేశ్వరి ఇంటికి వచ్చి బ్యాగు తెరిచి చూడగా బంగారు చైన్, రూ.4 వేల నగదు కనిపించలేదు. దీంతో రాజేశ్వరి దిగ్భ్రాంతి చెందింది. ఆటోలో మహిళ తన దృష్టి మరల్చి, చైన్, డబ్బు చోరీ చేసినట్లు రాజేశ్వరి నిర్ధారించుకుంది. దీనిపై నీలంకరై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలలో ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
టీచర్పై ప్లస్ టూ
విద్యార్థుల దాడి
తిరువొత్తియూరు: పాఠశాలకు ఆలస్యంగా రావడాన్ని ప్రశ్నించిన ఉపాధ్యాయుడిపై ప్లటూ విద్యార్థులు దాడి చేశారు. చైన్నె కొత్త చాకలిపేట దేశీయనగర్ నాలుగో వీధికి చెందిన వినోద్ (39) చైన్నె కొడంగయూర్ పొన్నుస్వామినగర్లోని పద్మప్రకాష్ మెట్రిక్యులేషన్ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పాఠశాలలో చదువుతున్న మాధవరం ప్రాంతానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా పాఠశాలకు వచ్చారు. ఆ సమయంలో ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను పిలిచాడు. కానీ విద్యార్థులు నిర్లక్ష్యం చేసి అక్కడికి వెళ్లలేదు. సమాచారం అందుకున్న పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వినోద్ అక్కడికి వెళ్లి వారిని ఆలస్యం విషయమై ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. దీంతో వినోద్ కుమార్ ఎడమ కంటి వద్ద గాయమైంది. అతన్ని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను విచారిస్తున్నారు.
రౌడీల అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె, ఎంకేబీ నగర్, పులియాంతోపు ప్రాంతాల్లో వేర్వేరు సంఘటనలకు సంబంధించి పోలీసులు పలువురు రౌడీలను అరెస్టు చేశారు. చైన్నె, ఎంకేబీ నగర్ నార్త్ అవెన్యూ రోడ్డులో ప్రజలకు భీతిని కలిగిస్తున్న వ్యాసర్పాడి దామోదరన్ నగర్కు చెందిన సంతోష్ (36), దినేష్ (29)ను అరెస్టు చేశారు. అలాగే పులియాంతోపు మేకలతొట్టి వద్ద మాంసం కొనడానికి వచ్చే వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి, డబ్బు వసూలు చేస్తున్న పులియాంతోపు, కన్నికాపురం, కస్తూరిబాయి కాలనీకి చెందిన కార్తీక్ (32) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పులియాంతోపు కెనాల్ స్ట్రీట్ ప్రాంతంలో గుట్కా అమ్ముతున్న పులియాంతోపు నరసింహనగర్ ఒకటో వీధికి చెందిన సూర్య(19), బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసులో అతని తండ్రి తిరుమలను అరెస్టు చేశారు.
6 చోట్ల కొత్త ట్రాన్స్ఫార్మర్లు
తిరువొత్తియూరు: ఎన్నూర్, తిరువొత్తియూర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం నివారించడానికి ఆరు చోట్ల కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుకు భూమిపూజ చేశారు. తిరువొత్తియూర్ ఎమ్మెల్యే కేపీ శంకర్, జోనల్ కమిటీ చైర్మన్ టీఎం తనియరసు, కౌన్సిలర్ ఎంఎస్ తిరవియం ట్రాన్స్ఫార్మర్ల స్థాపనకు భూమి పూజ చేశారు.
అన్నానగర్: మద్యం తాగితే ఓ రోజంతా అమ్మవారి ఆలయం వద్ద స్తంభానికి కట్టి వేయాలని పంచాయతీలో గ్రామపెద్దలు తీర్మానం చేశారు. వివరాల్లోకి వెళితే.. నాగై జిల్లా, వేదారణ్యంలోని పంజనదికులం నడుచ్చేతి పంచాయతీలోని సిరుదలైకాడు మత్స్యకార గ్రామం. ఈ గ్రామంలో 2 వేల మందికి పైగా నివసిస్తున్నారు. చేపల వేట వీరి ప్రధాన వృత్తి. ఈ గ్రామంలో మద్యానికి బానిసైన యువకులతో ఆ అలవాటును మాన్పించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దీంతో శుక్రవారం సిరుదలైకాడులో గ్రామాధికారి నామకోటి నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. సిరుదలైకాడులో నిత్యం మద్యం సేవించే వ్యక్తులను పట్టుకుని మారియమ్మన్ ఆలయం వద్ద స్తంభానికి ఒక రోజు పాటు కట్టి వేయాలని తీర్మానించారు. అలాగే మద్యం సేవించి, వాహనం నడిపితే ఆ బైకును జప్తు చేయాలని తీర్మానించారు. మహిళలను ఆటపట్టించకూడదని, వెంబడించకూడదని, వారిని ఒత్తిడి చేయకూడదని, ఎవరైనా అలాంటి పని చేస్తూ దొరికితే, అపరాధి గుడి ముందు గుండు చేయించుకోవాలని నిర్ణయించారు. ప్రజలు పంచాయతీ సమావేశంలో ఈ తీర్మానాలను ఆమోదించి, వాటిని ముద్రించి పట్టణంలోని రెండు ప్రదేశాల్లో ఉంచారు. గ్రామంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు, మహిళలు హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ విషయం గురించి గ్రామాధికారి నామకోడి మాట్లాడుతూ యువత నిరంతరం మద్యం సేవించి ప్రమాదాలకు గురవుతున్నారని, మద్యపానంతో కుటుంబాలు నాశనమవుతున్నాయని గమనించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
8 నెలల గర్భిణి హత్య
అన్నానగర్: ఎనిమిది నెలల గర్భిణి హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి జిల్లా వేప్పనపల్లి సమీపం అటవీ ప్రాంతంలో శుక్రవారం కుళ్లిపోయిన స్థితిలో చెట్టుకు వేలాడుతు ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న వెప్పనపల్లె పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం కృష్ణగిరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో మృతురాలు పల్లెరి గ్రామానికి చెందిన మూర్తి కుమార్తె షాలిని (25)గా గుర్తించారు. 8 నెలల గర్భిణి అయిన ఈమెను సుత్తితో కొట్టి, దుపట్టాతో గొంతు నులిమి హత్య చేశారని పోస్టుమార్టమ్ రిపోర్టులో నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు షాలిని కుటుంబ సభ్యులను విచారించారు. ఆమె 19వ తేదీ నుంచి కనిపించలేదని, ఆమె కోసం వెతుకుతున్నామని వారు తెలిపారు. దీంతో షాలిని మృతదేహం దొరికిన ప్రదేశంలో బాధితురాలి సెల్ఫోన్ సిగ్నల్లో ఎవరి నంబర్లు రికార్డు ఆధారంగా దర్యాప్తు చేశారు. ఆ సెల్ఫోన్ నంబర్లు పందికురి గ్రామానికి చెందిన మేఘనాథన్ (21), కృష్ణగిరి సమీపంలోని పెరియా అగ్రహారానికి చెందిన పుగళేంది (19)కి చెందినవని తేలింది. పోలీసులు వారిని అరెస్టు చేసి విచాచించారు. మేఘనాథన్కు షాలినితో వివాహేతర సంబంధం ఉందని, ఈ క్రమంలో వారిద్దరి మధ్య విబేధాలు రావడంతో మేఘనాథన్ తన స్నేహితుడు పుగళేంది సహాయంతో షాలినిని హత్య చేశాడు. దీంతో పోలీసులు శనివారం మేఘనాథన్, పుగళేందిని అరెస్టు చేశారు.
కార్మికుడి హత్య
తిరువొత్తియూరు: జీతం, నగదు ఇవ్వలేదని కార్మికుడిని హత్య చేసిన మరో కార్మికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..తిరువేర్కాడు సెల్వగణపతి నగర్, ఫస్ట్ స్ట్రీట్లో దండపాణి(45) బంధువుల ఇంట్లో ఉంటూ దినసరి కూలీగా పనికి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో ఇతడు రెండు రోజుల కిందట బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో చైన్నె తిరువేర్కాడు గ్రీన్పార్క్ ప్రాంతంలోని ముళ్ల పొదలో గాయాలతో ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు శుక్రవారం సాయంత్రం సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో అదే ప్రాంతానికి చెందిన సుడలై (40)ని అనుమానించి, అరెస్టు చేసి విచారించారు. దండపాణి, సుడలై కలిసి పెయింటర్లుగా పని చేయడానికి వెళ్లారు. సుడలై జీతం డబ్బు తీసుకుని దండపాణికి ఇవ్వకుండా మోసం చేశాడు. ఆగ్రహం చెందిన సుడలై సంఘటన జరిగిన రోజు, మద్యం మత్తులో దండపాణిని కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయినట్లు అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన తిరువెర్కౌడ్ పోలీసులు సుడలైని అరెస్టు చేశారు.

తమిళ భాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి