
క్లుప్తంగా
కారులో గుట్కా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
తిరుత్తణి: ఆంధ్రప్రదేశ్ నుంచి కారులో చైన్నెకు నిషేధిత గుట్కా తరలిస్తున్న యువకుడిని పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం పోలీసులు శుక్రవారం రాత్రి చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలోని ఆర్కాడుకుప్పం వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చైన్నె వైపు వెళుతున్న కారును ఆపి తనిఖీ చేశారు. కారులో నిషేధిత గుట్కా, పొగాకు ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి కారుతోసహ వాటిని స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించి విచారించారు. విచారణలో కనకమ్మసత్రం సమీపంలోని నెడుంబరం అరుంధతీ కాలనీకి చెందిన ముత్తుసెల్వన్(29) అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని నగరి నుంచి కారులో చైన్నెకు 50 కిలోల గుట్కా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
బైకును ఢీకొన్న కంటైనర్
● దంపతుల మృతి
వేలూరు: బైక్ను కంటైన్ ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. వేలూరు జిల్లా పొయిగై సమీపంలోని పిల్లయార్ ఆలయ వీధికి చెందిన రమేష్(43), అతని భార్య గోమది(36) శనివారం ఉదయం వేలూరుకు బైకులో బయలు దేరారు. ఆ సమయంలో బెంగళూరు నుంచి చైన్నెకి వస్తున్న కంటైనర్ అతి వేగంగా వచ్చి వారి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి తెలుసుకున్న విరింజిపురం పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం వేలూరు ఆస్పత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్ ఆకాష్ యాదవ్ను అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన కంటైనర్ నుంచి ఉన్న ఫళంగా మంటలు చెలరేగడంతో జాతీయ రహదారిలో సంచలనం రేగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ప్లాస్టిక్ రహిత సమాజంలో భాగస్వాములు కావాలి
తిరువళ్లూరు: ప్లాస్టిక్ రహిత సమాజానికి యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతాప్ పిలుపునిచ్చారు. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళెంలోని భవానీ అమ్మవారి ఆలయంలో మెగా మాస్ క్లీనింగ్, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ, పసుపు బ్యాగుల పంపిణీతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రతాప్ హాజరయ్యారు. మొదట దేవదాయశాఖ ఆధ్వర్యంలో మెగా మాస్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఆషాఢమాసంలో పెద్దపాళెం భవానీ అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ చేసే యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. తరువాత ఆలయానికి వచ్చిన భక్తులకు ప్లాస్టిక్ వస్తువులతో కలిగే అనర్థాలను వివరించి, పసుపు బ్యాగులను అందజేశారు.
కన్నకూతురిని కడతేర్చాడు!
అన్నానగర్: కన్న కూతురిని ఓ తండ్రి కొట్టి చంపిన ఘటన చిదంబరం సమీపంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాలోని చిదంబరం కాట్టుమన్నర్ కోయిల్ సమీపంలోని టి.మడప్పురం గ్రామానికి చెందిన అర్జునన్ (57) కూలీగా జీవిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, అబిత (27) అనే కుమార్తె ఉన్నారు. ఈమె ఎంఎస్సీ, ఎంఈడీ పూర్తి చేసింది. అబిత కాట్టుమన్నర్ కోయిల్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు వివాహం చేయడానికి అర్జునన్ వరుడి కోసం వెతకడం ప్రారంభించాడు. అర్జునన్ అభితకు కొంతమంది యువకుల ఫొటోలను కూడా చూపించాడు. కానీ ఆమె ఏదో కారణం చెప్పి పెళ్లిని వాయిదా వేయండంటూ వచ్చింది. కుమార్తె ప్రవర్తనపై అర్జునన్కి అనుమానం కలిగించింది. దీంతో అతను ఆమె పర్యవేక్షించి, విచారణ చేపట్టారు. అప్పుడు తన కూతురు ఒకరిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఇది అర్జునన్కి బాధ కలిగించింది. ఈ స్థితిలో శుక్రవారం అబిత విధులకు వెళ్లలేదు, ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అర్జునన్ తన కుమార్తెను తాను చూసే వరుడిని వద్దంటున్నావెందుకని అడిగాడు. ఆ సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. కోపంగా ఉన్న అర్జునన్, తన కుమార్తెను అక్కడ ఉన్న కత్తితో గొంతు కోసి, కట్టితో కొట్టాడు. దీంతో అభిత సంఘటన స్థలంలోనే మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి అభిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసి అర్జునన్ని అరెస్టు చేశారు.

క్లుప్తంగా