
ఆగిన బస్సు షెల్టర్ నిర్మాణం
తిరుత్తణి: పట్టణంలోని అక్కయ్య రోడ్డులో బస్సు షెల్టర్ నిర్మాణానికి మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులు ఆర్ధాంతరంగా ఆగాయి. తిరుత్తణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైళ్లు, బస్సుల ద్వారా వస్తుంటారు. సుబ్రమణ్యస్వామి ఆలయానికి వచ్చే భక్తులు రైల్వేస్టేషన్, కమల థియేటర్ సమీపంలోని అక్కయ్య రోడ్డులో బస్స్టాప్ వద్ద వేచి ఉండి వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. చాలా కాలంగా బస్ షెల్టర్ లేక పోవడంతో ప్రయాణికులు, ఎండ, వానలకు రోడ్డుపై వేచివుండి ప్రయాణించాల్సి వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నిధుల రూ.23 లక్షల మంజూరయ్యాయి. దీంతో బస్షెల్టర్ నిర్మాణ పనులు నెల కిందట ప్రారంభమయ్యాయి. వేగంగా పనులు జరుగుతుండగా అక్కయ్య రోడ్డులో దుకాణ యజమానులు బస్ షెల్టర్ నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన హైకోర్టు బస్షెల్టర్ నిర్మాణానికి తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో బస్షెల్టర్ పనులు ఆగాయి. చాలా కాలం తరువాత ప్రయాణికుల కోసం నిర్మిస్తున్న బస్షెల్టర్ పనులు అర్ధాంతరంగా ఆగడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.