
భగవద్గీతతో అద్భుతమైన పరివర్తన
కొరుక్కుపేట: భగవద్గీతలోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్న వారి జీవితంలో అద్భుతమై పరివర్తన వచ్చి తీరుతుందని ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు, ఆథ్యాత్మిక ప్రబోధకులు, గురువు శ్రీ వివేకానంద ఉపదేశించారు. ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్, ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు ఏర్పాటు చేసిన ఆత్మజ్ఞానం సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఆథ్యాత్మిక సదస్సుకు గురువు శ్రీవివేకానంద విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆత్మచైతన్యంపై సమగ్ర అవగాహననే జ్ఞానం అని పేర్కొన్నారు. అలాగే సత్యం, జ్ఞానం అనేది తెలుసుకుంటే జీవితం ఎంతో బాగుంటుందన్నారు. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది లేనే లేదన్నారు. రెండు దశాబ్దాలుగా భగవద్గీత, గరుడపురాణం తదితర గ్రంథాల్లోని సారాంశాన్ని అందరికీ ఉపదేశిస్తున్నట్టు తెలిపారు. ప్రతి మానవడు భగవద్గీత అర్థం చేసుకోవాలన్నారు. దాన్ని అర్థం చేసుకుంటే వారి జీవితంలో అద్భుత పరివర్తన వచ్చి తీరుతుందని తెలిపారు. అనంతరం గురువు వివేకానందను డబ్ల్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీమోహనరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సంధ్య, సాంబశివరావు, ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ప్రతినిధి సుభాషిణి పాల్గొన్నారు.