
తిరుచ్చిపై వెంకన్న విహారం
చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారు శనివారం బంగారు తిరుచ్చి వాహనంపై విహరించారు. వారపు ఉత్సవాల్లో భాగంగా వేకువనే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు కనులపండువగా కల్యాణోత్సవం జరిపించారు. సాయంత్రం వేడుకగా ఊంజల్ సేవ చేపట్టారు. ఈ క్రమంలోనే సర్వాలంకారభూషితులైన దేవదేవేరులను బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి ఊరేగించారు.
వైభవంగా ప్రసన్నుడి గ్రామోత్సవం
వడమాలపేట (విజయపురం): వడమాలపేట మండలం అప్పలాయిగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం శ్రీవారి గ్రామోత్సవం, ఊంజల సేవను వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొల్పి నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఉభయనాంచారుల సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామిని సర్వాభరణాలు, పూలమాలలతో అలంకరించారు. వేదమంత్రాలు భక్తుల గోవింద నామస్మరణ నడుమ స్వామి వారి ఊంజల సేవ కొనసాగింది. అనంతరం పద్మావతి అండాల్ సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామిని మేళాతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని, మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ అధికారి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.