
● బూత్కమిటీలపై దృష్టి ● నేడు జిల్లాల కార్యదర్శులతో భేట
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి విందు ఇచ్చారు. పొద్దు పోయే వరకు ఈ విందు కార్యక్రమం బుధవారం రాత్రి జరిగింది. ఇందులో పసందైన శాఖహారం, మాంసాహరం వంటకాలను వడ్డించారు. అందరితోనూ పళణి స్వామి పలకరిస్తూ ముందుకు సాగారు. డీఎంకేను ఓడించడం లక్ష్యంగా బీజేపీతో కూటమిగా వెళ్తున్నట్టు, మరికొన్ని పార్టీలు కూటమిలోకి రాబోతున్నట్టుగా ఎమ్మెల్యేలకు పళణి స్వామి సూచించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూనే, కూటమి ధర్మం కారణంగా ఏదేని నియోజకవర్గాలను కోల్పోవాల్సి వస్తే, అక్కడి సిట్టింగ్లకు పార్టీ పరంగా, అధికారంలోకి వచ్చినానంతరం ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నట్టు సమాచారం. ఇక గురువారం బూత్ కమిటీలను పర్యవేక్షిస్తున్న ముఖ్య నిర్వాహకులు, ఇన్చార్జ్లతో పళణి భేటి సాగింది. బూత్ కమిటీల ఏర్పాటు విస్తృతం చేయాలని పళణి స్వామి ఆదేశించారు. శుక్రవారం పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశం జరగనుంది. ఏన్డీఏ కూటమిలోకి మళ్లీ చేరినానంతరం తొలిసారిగా జరుగుతున్న జిల్లాల కార్యదర్శుల భేటీ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. కాగా విందు కార్యక్రమానికి సీనియర్ ఎమ్మెల్యే సెంగోట్టయన్ దూరం కావడం చర్చకు దారి తీసింది. అదే సమయంలో గురువారం అసెంబ్లీలో పళణి నామస్మరణతో ఆయన ప్రసంగించడం ఆ చర్చకు బ్రేక్ పడేలా చేసింది. ఎంజీఆర్, జయలలిత మార్గంలో పార్టీని పళణి స్వామి విజయవంతంగా నడిపిస్తున్నారని సెంగోట్టయన్ కితాబివ్వడం గమనార్హం.