
సముదాయ భవన నిర్మాణానికి భూమిపూజ
తిరువళ్లూరు: చోళవరంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సముదాయ భవనం నిర్మాణానికి రాష్ట్ర మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్ తదితరులు భూమిపూజ చేశారు. తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్ పంజెట్టి ప్రాంతంలో పొన్నేరి ఎమ్మెల్యే దురై చంద్రశేఖర్ నిధుల నుంచి సముదాయ భవనం నిర్మాణం కోసం రూ.50 లక్షల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో నిర్మించనున్న సముదాయ భవన నిర్మాణానికి మంగళవారం ఉదయం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి నాజర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాజర్ మాట్లాడుతూ పనులు నాణ్యతగా ఉండడంతో పాటు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సముదాయ భవనం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం చోళవరంలోని పాడియనల్లూరు ప్రభుత్వ పాఠశాల తనిఖీ చేశారు. చోళవరంలో రేషన్ దుకాణాలలోని వస్తువులను మంత్రి నాజర్, కలెక్టర్, ఎమ్మెల్యేలు పరిశీలించారు.