
స్థల వివాదంలో ఇరువర్గాల ఘర్షణ
పుట్టపర్తి టౌన్: స్థల వివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ శనివారం కొత్తచెరువులో కలకలం రేపింది. పోలీసు స్టేషన్ ఎదుటే బాహాబాహీకి దిగగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే... కొత్తచెరువుకు చెందిన దాల్మిల్ సూరి భార్య మహలక్ష్మి కొత్తచెరువులోని తన 7.5 సెంట్ల భూమిని రిజిస్టర్ ఆయకం పెట్టి బుక్కరాయసముద్రానికి చెందిన సూర్యనారాయణరెడ్డి భార్య సుశీలమ్మతో ఐదేళ్ల క్రితం రూ. 50 లక్షలు అప్పుగా తీసుకుంది. క్రమం తప్పకుండా వడ్డీతో పాటు అసలు కొంత చెల్లిస్తూ ఇప్పటికే రూ.40 లక్షలు దాకా చెల్లించారు. మిగతా మొత్తం చెల్లిస్తామని తమ భూమిని తిరిగి తమకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని మహలక్ష్మి కోరింది. అయితే రుణదాత సుశీలమ్మ భూమిని రిజిస్టర్ చేయించకుండా కాలయాపన చేసింది. దీంతో మహలక్ష్మి కోర్టును ఆశ్రయించగా... ఈ కేసు పెండింగ్లో ఉంది. అయినప్పటికీ శనివారం సుశీలమ్మ కుమారుడు సాగర్రెడ్డి రెండు వాహనాలలో కిరాయి గుండాలను తీసుకుని వచ్చి కొత్తచెరువులోని స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న మహలక్ష్మి వర్గీయులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో మాటామాట పెరగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసం కాగా... 8 మందికి గాయాలయ్యాయి. అనంతరం ఇరువర్గాల వారు ఫిర్యాదు చేసేందుకు కొత్తచెరువు పోలీస్టేషన్కు వెళ్లారు. స్టేషన్ ముందు మరోసారి ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు అందరికీ సర్దిచెప్పారు. అనంతరం ఇరువర్గాల నుంచి ఫిర్యాదు తీసుకుని క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రెండు వాహనాలు ధ్వంసం..
8 మందికి గాయాలు

స్థల వివాదంలో ఇరువర్గాల ఘర్షణ