
సత్వర పరిష్కారం చూపాలంటూ..
● నెల్లూరులో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● 402 వినతుల అందజేత
● హామీలు నెరవేర్చాలంటూ సీపీఐ ధర్నా
● రేషన్కార్డుల కోసం పలువురి వినతి
నెల్లూరు రూరల్: వినతులకు సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఇన్చార్జి కలెక్టర్ కె.కార్తీక్, ఇతర అధికారులు ప్రజల నుంచి 402 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 169, పోలీస్ శాఖవి 47, మున్సిపల్ శాఖవి 38, సర్వేవి 29, పంచాయతీరాజ్ శాఖవి 23 తదితర అర్జీలందాయి. కార్యక్రమంలో డీఆర్వో ఉదయభాస్కర్, డ్వామా పీడీ గంగాభవాని, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, డీఎంహెచ్ఓ సుజాత, హార్టికల్చర్ ఏడీ సుబ్బారెడ్డి, విద్యుత్ ఎస్ఈ విజయన్ తదితరులు పాల్గొన్నారు.
● రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 23 ప్రకారం బదిలీల్లో విభిన్న సామర్థ్యం ఉన్న ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ ఆర్థోపెడికల్ హ్యండీక్యాప్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగాధర్ అర్జీ ఇచ్చారు. ఉద్యోగులకు వారు కోరుకుంటేనే బదిలీ చేయాలని, లేకుంటే ప్రస్తుత స్థితిలోనే ఉంచాలన్నారు.
● కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజులను ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయని, దీంతో తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఇంకా అక్రమ మైనింగ్ తదితర అంశాలపై వినతిపత్రం అందజేశారు.
తాగునీటి సమస్యపై..
నెల్లూరు రూరల్ అల్లీపురంలో టిడ్కో ఇళ్లలోని అనేక బ్లాకుల్లో కొంతకాలంగా మంచినీరు రాక సుదూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి నీరు సక్రమంగా అందడం లేదని, ఆపరేటర్లను అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారన్నారు. అధికారులు స్పందించాలని కోరారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం సభ్యులు సుకన్య, మల్లిక, లక్ష్మి, పద్మ, పున్నమ్మ, శీనయ్య, శేఖర్, మణి తదితరులు పాల్గొన్నారు.

సత్వర పరిష్కారం చూపాలంటూ..