
మృగశిర మురిపెం
చేపల కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిట ● అధిక ధరలకు విక్రయం
దుబ్బాక: జిల్లాలో మృగశిర కార్తె సందడి నెలకొంది. చేపలకు డిమాండ్ పెరిగింది. మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపలు తింటే ఏడాదంతా ఆస్తమా ఇతర శ్వాసకోశ వ్యాధులు దరిచేరవని ప్రజల విశ్వాసం. దీంతో ఆదివారం చేపలు కొనేందుకు మార్కెట్లలో ప్రజలు బారులు తీరారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో చేపల కొనుగోళ్లతో సందడి కనిపించింది. ప్రజలు ఇష్టపడే కొర్రమీను అంతంత మాత్రమే రావడంతో వచ్చిన కొన్నింటిని ధర ఎక్కువైనా పోటీపడి కొనుగోలు చేశారు. కొర్రమీనులకు రూ.600 నుంచి రూ. 800 వరకు ధర పలికింది. బంగారుతీగలు, రవ్వ, బొచ్చ, గురిజలు, జెల్లలతో పాటు పలు రకాల చేపలను కొన్నారు. మిగతా రోజుల్లో రూ.100 ఉన్న చేపలు మృగశిర సందర్భంగా రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయించారు. జిల్లాలో 90 శాతం పైగా చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో చేపలు పుష్కలంగా పెరిగాయి. అయినా మృగశిర రోజు డిమాండ్ పెరగడంతో అధిక ధరలకు విక్రయించారు.

మృగశిర మురిపెం

మృగశిర మురిపెం