
పూర్తి హక్కులు పొందేందుకే భూభారతి
● కలెక్టర్ మనుచౌదరి ● ఖమ్మంపల్లిలో రెవెన్యూ సదస్సు
కొండపాక(గజ్వేల్): భూములపై రైతులు పూర్తి హక్కులు పొందేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. కొండపాక మండలం ఖమ్మంపల్లిలో బుధవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలలో అనర్హులకు అవకాశం కల్పించారని, పంపిణీ చేయగా మిగిలిన 19 ఇళ్లను అర్హులకు దక్కేలా చూడాలని పలువురు కలెక్టర్ను కోరారు. ఖమ్మంపల్లి పంచాయతీని రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయాలని, ఖమ్మంపల్లి నుంచి ఎన్సాన్పల్లి మీదుగా సిద్దిపేటకు వెళ్లేందుకు ఏళ్ల కిందట వేసిన బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతిని ప్రయాణానికి ఆటంకంగా మారిందని, అనుకూలంగా మార్చాలని, గోదావరీ నదీ జలాలతో చెర్వు నిండేలా చూడాలంటూ కలెక్టర్కు దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చూడటం కోసమే భూ భారతి చట్టాన్ని అమలు చేసిందన్నారు. ఈనెల 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. దరఖాస్తుల్లో వచ్చిన భూ సమస్యల అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. గ్రామస్తులు అడిగిన సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యాక్రమంలో ఆర్డీఓ చంద్ర కళ, తహసీల్దార్ శ్యాం, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.