కాంతివేగంతో డేటా | DRDO and IIT Delhi Achieve 1km Quantum Secure Communication Test | Sakshi
Sakshi News home page

కాంతివేగంతో డేటా

Jun 18 2025 5:03 AM | Updated on Jun 18 2025 5:03 AM

DRDO and IIT Delhi Achieve 1km Quantum Secure Communication Test

అత్యంత భద్రమైన క్యాంటమ్‌ కమ్యూనికేషన్‌ పరీక్ష సక్సెస్‌

డీఆర్‌డీవో, ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తల ఘనత

ప్రపంచంలోనే అత్యాధునిక, అత్యంత సురక్షితమైన సమాచార బదిలీ విధానమైన క్వాంటమ్‌ కమ్యూనికేషన్స్‌లో భారత్‌ తన సత్తా చాటింది. తొలిసారిగా అత్యంత భద్రమైన డేటా ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ అయిన క్వాంటమ్‌ కమ్యూనికేష్‌ను విజయవంతంగా పరీక్షించామని రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)–ఢిల్లీ సంయుక్తంగా ప్రకటించాయి. దీంతో డేటా హ్యాకింగ్‌కు ఎలాంటి అవకాశంలేని విధానాన్ని భారత్‌ తన రహస్య సమాచారమార్పిడి కోసం వినియోగించుకునేందుకు అవకాశం లభించింది.

ఢిల్లీ క్యాంపస్‌లో ఫ్రీ–స్పేస్‌ ఆప్టికల్‌ లింక్‌ ద్వారా శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. ఈ వివరాలను రక్షణ శాఖ వెల్లడించింది. సెకన్‌కు 250 బిట్స్‌ సెక్యూర్‌ కీ రేటుతో ఈ విధానాన్ని పరీక్షించారు. ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభినందించారు.

ఏమిటీ క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌?
క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ అనేది సాధారణ ప్రజలు అస్సలు నమ్మలేనంతటి, గమ్మతైన సమాచార మార్పిడి విధానం. సాధారణభాషలో చెప్పాలంటే.. ఇద్దరు స్నేహితుల వద్ద చెరో వాకీటాకీ ఉందనుకుందాం. వాకీటాకీ అనేది కాస్తంత దూరాలకు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ స్నేహితుల్లో ఒకడు చంద్రమండలం మీద ఉన్నాసరే అతను మాట్లాడేది ఇతని వాకీటాకీలో వినిపిస్తే ఎలా ఉంటుంది?. మధ్యలో ఎవ్వరూ వీరి మాటలను ట్రాక్‌ చేయడంగానీ, హ్యాక్‌చేయడంగానీ కుదరకపోతే!. అద్భుతమే కదా. ఆ అద్భుతాన్ని సుసాధ్యంచేసే ప్రక్రియే క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌. విశ్వంలోనే అత్యంత సూక్ష్మమైన కాంతి అణువు(ఫొటాన్‌)ల సాయంతో పూర్తి సురక్షితంగా సమాచారాన్ని చేరవేయవచ్చు. 

ఇదంతా క్వాంటమ్‌ ఎంటాంజిల్‌మెంట్‌ మహిమ!
క్వాంటమ్‌ ఎంటాంజిల్‌మెంట్‌ దృగ్విషయం కారణంగా ఇలా అతిసూక్ష్మస్థాయిలో డేటాను మరోచోటుకు బదిలీచేయొచ్చు. దూరంతో సంబంధంలేకుండా ఎంతటి దూరాల మధ్యనున్న అణువుల మధ్య కూడా ఒక మార్మికమైన బంధం, బదిలీ సాధ్యమవుతుంది. దీనినే క్వాంటమ్‌ ఎంటాంజిల్‌మెంట్‌ అంటారు. కిలోమీటర్‌ దూరంలోని అణువుల మధ్య డేటా ట్రాన్స్‌ఫర్‌ను డీఆర్‌డీవో, ఐఐటీ శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తిచేశారు. దీనిని సింపుల్‌గా చెప్పాలంటే... 1990 దశకంలో పెద్ద హిట్‌ అయిన హీరో నాగార్జున సినిమా ‘హలో బ్రదర్‌’ చూసే ఉంటారు.

అందులో కవల సోదరుల్లో ఒకరు ఎలా డ్యాన్స్‌చేస్తే మరొకరు అలాగే కాలుకదపడం, ఎలా ఫైట్‌చేస్తే అలాగే డిష్యుండిష్యుం పోరాటం చేయడం చూసే ఉంటారు. క్వాంటమ్‌ ఎంటాంజిల్‌మెంట్‌లో కూడా అచ్చం ఇలాగే ఒక అణువుపై మనం సమాచారాన్ని నిక్షిప్లం చేస్తే ‘క్వాంటమ్‌ ఎంటాంజిల్‌మెంట్‌’ ద్వారా దానితో అదృశ్యబంధం ఏర్పర్చుకున్న ఫొటాన్‌ కణం మీద సైతం అదే సమాచారం ఠక్కున ప్రత్యక్షమవుతుంది.

పాత సినిమాల్లో మంత్రదండం సాయంతో మాంత్రికుడు ఒకచోట మాయమై మరోచోట ప్రత్యక్షమైనట్లు డేటా సైతం ఒక చోట నుంచి మరో చోటుకు కాంతివేగంతో ప్రసారమవుతుంది. నేటి సైబర్‌ ప్రపంచంలో దాదాపు ప్రతీ సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. కానీ క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌లో ఇది అసాధ్యం. ఒకవేళ అత్యంత నిపుణుడైన హ్యాకర్‌ ఈ జంట మధ్య డేటాచోరీకి యత్నిస్తే వెంటనే ఈ సెండర్, రిసీవర్లకు తెల్సిపోతుంది.

ఫ్రీ–స్పేస్‌ ద్వారా..
ఫ్రీ–స్పేస్‌ అంటే బహిరంగంగా ఈ సమాచార బదిలీ జరుగుతుంది. ఇందులో ఎలాంటి కేబుళ్లకు, వైర్లకు పనిలేదు. వేల కిలోమీటర్లదూరంలోని రెండు భవంతుల మధ్య, రెండు శాటిలైట్ల మధ్య కూడా క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ను ఉపయోగించవచ్చు. సైనిక రహస్యాల స్థాయిలో అత్యంత సురక్షితంగా డేటాను పంపించడానికి ఇçప్పుడు అందుబాటులో ఉన్న అన్ని ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ కంటే క్వాంటమ్‌ కమ్యూని కేషన్‌ అనేది మెరుగైంది. ఈ విధానంలో పంపే సమాచారాన్ని మూడో వ్యక్తి పసిగట్టలేరు. భారత్‌లో భవిష్యత్తులో క్వాంటమ్‌ నెట్‌వర్క్‌ లు, అల్ట్రా సెక్యూర్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్లకు ఈ విధానం బాటలువేయనుంది. ఎన్‌క్రిప్షన్‌ ద్వారా జాతీయ భద్రత, రక్షణ, ఆర్థిక, టెలికమ్యూనికేషన్స్‌ రంగాల్లో భవిష్యత్తులో ఈ సాంకేతికతను విరివిగా వాడుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement