ప్రమాదానికి గురైన కారును పరిశీలిస్తుండగా..
● వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
● ఔటర్పై ఘటన..డ్రైవర్ మృతి
శంషాబాద్ రూరల్: ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం చోటు చేసుకోగా కిందకు దిగి కారును పరిశీలిస్తుండగా..వెనక నుంచి గుర్తు తెలియని లారీ వచ్చి ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ పట్టణానికి చెందిన కాముని భరత్(26) డ్రైవర్గా పని చేస్తున్నాడు. అదే పట్టణ వాసి వేముల శేఖర్ కుటుంబాన్ని కారులో తీసుకుని శనివారం తెల్లవారుజామున కొల్లాపూర్లోని సింగోటం ఆలయానికి బయలుదేరారు. వీరి కారు పెద్దగోల్కొండ టోలు గేటు తర్వాత ఔటర్పై తుక్కుగూడ వైపు వెళ్తుండగా..పక్క నుంచి వచ్చిన ఓ లారీ వీరి కారును ఢీకొంది. దీంతో కారు కుడి వైపు టైరు, కారు దెబ్బతింది. ఈ ప్రమాదంతో కారు మొరాయించింది. అందులో ఉన్న డ్రైవర్ భరత్తో పాటు శేఖర్, అతని కూతురు బయటకు దిగారు. శేఖర్ భార్య శోభారాణి ఆరోగ్యం బాగాలేక కారులోనే కూర్చుంది. మొరాయించిన కారును భరత్ పరిశీలిస్తుండగా.. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని ఓ లారీ అతనితో పాటు కారును ఢీకొంది. తీవ్ర గాయాలైన భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న శోభారాణికి గాయాలవగా.. శేఖర్, అతని కూతురు తృటిలో తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


