బీజాపూర్ హైవేపై ఘోర ప్రమాదం
● ఎదురెదురుగా రెండు కార్లు ఢీ
● ఇద్దరు దుర్మరణం
మొయినాబాద్: మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటన మరువక ముందే బీజాపూర్ హైవేపై మరో యాక్సిడెంట్ జరగడం ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఫొటో షూట్కు వెళ్తున్న ఫొటోగ్రాఫర్లు ఐదు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకునేవారు. ఇంతలోనే వారు ప్రయాణిస్తున్న క్యాబ్ అతివేగంగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ కారులోనే ఇరుక్కుని దుర్మరణం చెందగా.. ఫొటో గ్రాఫర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కల్యాణదుర్గంకు చెందిన కరీం(37) కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నగరంలోని బంజారాహిల్స్కు చెందిన లోకేశ్(24), జగద్గిరిగుట్టకు చెందిన బాబురావు, కుత్బుల్లాపూర్కు చెందిన షేక్ అఖిల్ ముగ్గురు ఫొటోగ్రాఫర్లు కనకమామిడి రెవెన్యూ పరిధి గుల్మోర్ గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్స్లో ఫొటో షూట్కోసం శుక్రవారం కరీం క్యాబ్(వ్యాగనార్)లో బయలుదేరారు. క్యాబ్ను వేగంగా నడుపుతున్న డ్రైవర్ హైదరాబాద్–బీజాపూర్ హైవేపై మొయినాబాద్ సమీపంలోని ఆన్ ది వే డ్రైవ్ ఇన్ హోటల్(పెంటయ్య హోటల్) వద్దకు రాగానే రాంగ్రూట్లో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న హోండా డబ్ల్యూఆర్వీ కారుని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డుపక్కన బోర్డును ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. క్యాబ్ డ్రైవర్ కరీం కారులోనే ఇరుక్కుని దుర్మరణం చెందాడు, ఫొటో గ్రాఫర్ లోకేశ్ తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరు ఫొటోగ్రాఫర్లకు స్వల్ప గాయాలయ్యాయి. హోండా కారులో డాక్టర్ వంశీధర్రెడ్డి, బంధువులు సుజాత, రోజా, డ్రైవర్ వెంకట్ ఉన్నారు. డ్రైవర్ వెంకట్కు తీవ్రగాయలు కాగా సుజాత, రోజా స్వల్పంగా గాయపడ్డారు. వంశీధర్రెడ్డి సురక్షితంగా బయటపడ్డాడు.
చికిత్స పొందుతూ ఫొటోగ్రాఫర్ మృతి
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి కార్లలో ఇరుక్కుపోయినవారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు పది నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. లోకేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
క్యాబ్ డ్రైవర్ కరీం మృతదేహం
ఫొటో గ్రాఫర్ లోకేష్(ఫైల్)
ఆర్టీసీ బస్సు, కారు ఢీ..
చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ హైవే రోడ్డుపై దామరగిద్ద సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు ప్రయాణిస్తున్న వికారాబాద్ డిపోకు చెందిన బస్సు దామరగిద్ద సమీపంలో ఎదురుగా వికారాబాద్–చేవెళ్ల వైపు ప్రయాణిస్త్ను కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు, బస్సు ముందు భాగాలు రోడ్డుపక్కకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో ఎక్కించి పంపించారు.
బీజాపూర్ హైవేపై ఘోర ప్రమాదం
బీజాపూర్ హైవేపై ఘోర ప్రమాదం
బీజాపూర్ హైవేపై ఘోర ప్రమాదం


