అట్రాసిటీ కేసులు వేగంగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసులు వేగంగా పరిష్కరించాలి

Nov 21 2025 11:43 AM | Updated on Nov 21 2025 11:43 AM

అట్రాసిటీ కేసులు వేగంగా పరిష్కరించాలి

అట్రాసిటీ కేసులు వేగంగా పరిష్కరించాలి

ఇబ్రహీంపట్నం రూరల్‌: జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగతిన పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ బక్కి వెంకటయ్య సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, అడిషనల్‌ డీసీపీలు సత్యనారాయణ, పూర్ణచంద్రారావు, ఉదయ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్‌, రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కులసంఘాల నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ వెంకటయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల ప్రజలను ఇబ్బందికి గురిచేసే గ్రామాభివృద్ధి కమిటీలను ఉపేక్షించమని హెచ్చరించారు. అధికారులు గురుకుల పాఠశాలలను, వసతి గృహాల్లో విరివిగా తనిఖీలు చేపట్టి నాణ్యమైన భోజనం, మెరుగైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ నెల సమీక్ష సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. అనంతరం అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. భూ సమస్యలపై ఆర్డీఓలతో విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు రాంబాబు నాయక్‌, లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్‌, డీఆర్‌ఓ సంగీత, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామరావు, గిరిజన సంక్షేమ అధికారి రామేశ్వరిదేవి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఆర్డీఓలు చంద్రకళ, వెంకట్‌రెడ్డి, సరితలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు .

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

కలెక్టరేట్‌ కార్యాలయంలో వివిధ శాఖలతో సమీక్ష సమావేశం

యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు

షాద్‌నగర్‌: రాజశేఖర్‌ను హత్య కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటా మని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం ఆయన ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని ఎల్లంపల్లిలో ఇటీవల హత్యకు గురైన రాజశేఖర్‌ కుటుంబాన్ని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, శంషాబాద్‌ అడిషనల్‌ డీసీపీ పూర్ణచందర్‌, ఆర్‌డీఓ సరిత, ఏసీపీ లక్ష్మీనారాయణతో కలిపి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున రూ.4.12 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం వెంకటయ్య మాట్లాడుతూ.. ఆధునిక యుగంలోనూ పరువు హత్యలు బాధాకరమన్నారు.రాజశేఖర్‌ కుటుంబానికి కమిషన్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో రూ.50 లక్షల విలువ చేసే డబుల్‌ బెడ్‌రూం, ఐదు ఎకరాల భూమి అందజేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాజశేఖర్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని కలెక్టర్‌, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. అవసరానుసారం ఎల్లంపల్లిలో పోలీస్‌ అవుట్‌ పోస్టు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆలయ ప్రవేశ కార్యక్రమం చేపట్టండి

గ్రామంలో ఉన్న ఆలయంలోకి దళితులకు ప్రవేశం లేదని తెలుసుకున్న వెంకటయ్య వెంటనే ఆలయ ప్రవేశ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అన్నివర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించి, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు శంకర్‌, రాంబాబు నాయక్‌, తహసీల్దార్‌ నాగయ్య, సీఐ విజయ్‌కుమార్‌, నాయకులు సిద్దార్థ, రవి, జగన్‌, అనిల్‌కుమార్‌, భవానీమల్లేశ్‌, వేణుగోపాల్‌, రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement