
అప్పు పుట్టట్లే..!
జిల్లాలో దివాలా దిగులు
● జిల్లా వ్యాప్తంగా పలువురు వ్యాపారులు దివాలా తీస్తున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రముఖ హోటల్ వ్యవస్థాపకుడు తనకు హైదరాబాద్ వంటి నగరాలతోపాటు చాలా ప్రాంతాల్లో హోటల్ వ్యాపారం నడిపిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకున్నాడు. దాదాపు రూ.300కోట్ల వరకు దివాలా తీసినట్లు ప్రచారం ఉంది.
● దశాబ్దంన్నరకు పైగా సిరిసిల్లలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడిపిస్తూ జిల్లాలోనే నంబర్వన్ కౌంటర్గా ఓ వ్యాపారి పేరు గడించాడు. అనూహ్యంగా సదరు వ్యాపారీ రూ.3కోట్ల వరకు దివాలా తీసి కోర్టును ఆశ్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
● ఓ స్టీల్షాపు యజమాని రూ.కోటి, ఎలక్ట్రానిక్స్ షాప్ యజమాని కూడా కోట్లాది రూపాయలు దివాలా తీసి రుణదాతలకు ఐపీలు పంపించినట్లు ప్రచారంలో ఉంది.
● వేములవాడలో సైతం ఓ పూజారి జనాలకు అధిక వడ్డీలు ఆశ చూపించి రూ.2కోట్లు వరకు డబ్బులు వసూలు చేసి రుణదాతలకు ఇవ్వకుండా ఐపీలు పెట్టడం సంచలనం సృష్టించింది.
● వీరేకాకుండా జిల్లావ్యాప్తంగా పలువురు దివాలా తీసి పోగా రుణదాతలు ఆందోళనలో పడ్డ సంఘటనలు ఉన్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో మరికొంత మంది కూడా రుణాలు ఎగ్గొట్టే పరిస్థితుల్లో ఉన్నారన్న వార్తలు కూడా అప్పులు ఇచ్చే వారికి భయం పుట్టిస్తోంది.
ఇంటి అవసరాలు చెల్లించేదెట్లా?
సిరిసిల్లలో అధికశాతం జనాభా నేతకార్మి కులు, బీడి, వ్యవసాయరంగాల కార్మికులే. ఇక మధ్యతరగతి, వేతనజీవులు తర్వాతి స్థానంలో ఉంటారు. సంపన్నులు, వడ్డీకి ఇస్తూ గడిపేవారు తక్కువగా ఉంటారు. వేతన, మధ్యతరగతి, శ్రామికజీవులకు నెలలో ఆర్థిక అవసరాలకు కొందరు మాత్రమే ఉన్నారు.ఇటీవల జిల్లావ్యాప్తంగా వరుసగా దివాలా దీయడంతో నగదు లావాదేవీలు తగ్గిపోయాయి. అయిన వారికి కూడా అవసరానికి డబ్బులు ఇవ్వడానికి సంశయించే పరిస్థితులను జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇక సగటు మధ్య తరగతి జీవి నెలవారీ బడ్జెట్తోనే కాలం వెల్లదీస్తుంటాడు. ఆ నెలంతా అయిన ఖర్చులకు ఒకటో తేదీన వచ్చే జీతంతో ఒకేసారి చెల్లిస్తుంటాడు. ఇంటి అద్దె, పాలబిల్లు, కిరాణం, పిల్లల ట్యూషన్ ఫీజులు, ఆటోచార్జీలు, సెల్బిల్లు, డిష్బిల్లు...ఇలా నెల కాగానే బారెడు చెల్లింపులు ఉంటాయి. ప్రతీనెల ఒకటి నుంచి 5వ తేదీలోపు వీటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో కుటుంబం కనీసం రూ.10వేల నుంచి రూ.15వేలు చెల్లిస్తుంటాయి.