
సాక్షి, చెన్నై: శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా(Vinutha Kotaa) అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి(bojjala sudheer reddy) తన ద్వారా వినుత.. ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలన చరచకు దారి తీసింది. ఈ క్రమంలో..
వినుత కోట తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారామె. ఆ వీడియోలో సారాంశం ఇలా..
‘‘మనసునిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేక పోయినా.. మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది. రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది. కాబట్టే 19 రోజుల్లో బెయిలు ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బయలు వచ్చింది. విదేశాల్లో రూ లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు.
.. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను. ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు శివయ్యకు తెలుసు. ధైర్యంగా పోరాడుతాం.ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్ తో బయటకు వస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టే.. మీడియా ముందుకు రాలేక పోతున్నాను. కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యమేవ జయతే. జై హింద్ అని అన్నారామె.
మొన్నీమధ్యే కొట్టే సాయిప్రసాద్కు శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్గా పదవి లభించింది. దీనిపై వినుత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొంటూ జనసేన అధినేత పవన్కల్యాణ్(Jana Sena Chief pawan Kalyan)కు ఆమె లేఖ రాశారు. ఈలోపు.. రాయుడి వీడియో కలకలం రేపింది.

ఇదిలా ఉంటే.. వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలుగానీ, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ రాయుడు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ వీడియోపై బొజ్జల నుంచి స్పందన రావాల్సి ఉంది. ఈ ఏడాది జులై 7న కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు.. రాయుడిని హత్యచేసి మర్నాడు చెన్నై కూవం నదిలో పడేశారని కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో నిందితులు చెన్నైలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: పవన్ కొత్త పాట.. ఏకిపారేస్తున్న నెటిజన్స్