
విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం
● ‘సీబీఎస్ఈ’ ప్రారంభం వాయిదా ● హాజరుకాని మంత్రులు, ప్రజాప్రతినిధులు ● ఖరారుకాని ప్రవేశాలు ● ఆందోళనలో సింగరేణి ఉద్యోగులు
గోదావరిఖని: సింగరేణిలోని సీబీఎస్ఈ స్కూల్ ప్రారంభం వాయిదాపడింది. అధికారులు, సింగరేణి సంస్థ సీఎండీ యైటింక్లయిన్కాలనీలోని సీబీఎస్ఈ స్కూల్ ప్రారంభానికి శుక్రవారం ముహూర్తం ఖరారు చేశారు. అయితే, సాయంత్రం వరకూ మంత్రుల రాకకోసం వేచిచూసినా.. పెద్దపల్లిలోనే అభివృద్ధి పనులు పూర్తిచేసుకుని అటే వెళ్లిపోయారు. దీంతో చివరి నిమిషంలో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఈ స్కూల్లో 408 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. ఇందుకోసం 1,600 మంది దరఖాస్తు చేశారు. ఈనెల 12 న తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది.
విద్యార్థుల ఎదురు చూపులు
సింగరేణి చరిత్రలోనే తొలిసారి సీబీఎస్ఈ విద్యావిధానం ప్రారంభం కానుండడంతో రామగుండం రీజియన్లోని కార్మికుల పిల్లలను చదివించేందుకు పోటీపడ్డారు. ఇతర స్కూళ్లలో చదువుతున్న వారికోసం కూడా ఇందులో దరఖాస్తు చేశారు. ఇక్కడ సీటు కన్ఫర్మ్ కోసం ఎదురుచూస్తున్నారు. సీట్ల కేటాయింపులో జాప్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో సీటు రాకపోతే విద్యాసంవత్సరం మధ్యలో వేరే పాఠశాలలో దొర కడం కష్టంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి సీట్లు ఖరారు చేయాలని వారు కోరుతున్నారు.
మంత్రుల పేరిట ఆహ్వానపత్రిక
సింగరేణి ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్పొరేట్ స్థా యిలో తీర్చిదిద్దిన సీబీఎస్ఈ పాఠశాల ప్రారంభంవాయిదా పడింది. రూ.3కోట్లు వెచ్చించి స్కూల్కు ఆధునిక హంగులు దిద్దారు. ప్రారంభ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, వివేక్వెంకటస్వా మి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరవుతారని ఆహ్వానపత్రికపై పేర్లు ముద్రించారు. అయితే, ప్రొటోకాల్ సమస్యతో స్కూల్ ప్రా రంభోత్సవం వాయిదా పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు టూర్ షెడ్యూల్లో సింగరేణి సీబీఎస్ఈ స్కూల్ ప్రారంభోత్సవం లేదని, ఎలిగేడు, పెద్దపల్లిలోని కార్యక్రమాల షెడ్యూలే ఉందని సమాచారం.
సొమ్ము సింగరేణిది.. పెత్తనం ప్రభుత్వానిది
సింగరేణి సొమ్ముతో ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన సీబీఎస్ఈ స్కూల్ ప్రారంభంపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య ప్రశ్నించారు. స్థానిక భాస్కర్రావు భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆహ్వాన పత్రికలో సంస్థ సీఎండీ బలరాం, సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులకు అవమానం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లను పెద్ద అక్షరాలతో వేసి సింగరేణి సీఎండీ, యూనియన్ నాయకుల పేర్లను కింద చిన్నగా ముద్రించడం ఏమిటని ప్రశ్నించారు. తమ అధికారాన్ని కాపాడుకోవడానికి అధికార పార్టీకి అధికారులు తాబేదారులుగా మారారని ఆయన ఆరోపించారు. జీఎంలు సిగ్గు లేకుండా ఫైళ్లు పట్టుకుని ఎమ్మెల్యేల వద్దకు పరుగులు తీస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇంతకుముందు సింగరేణి అధికారులతో పనిపడితే ఎమ్మెల్యేలే జీఎంల వద్దకు వచ్చి మాట్లాడేవారని ఆయన గుర్తుచేశారు.

విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం

విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం

విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం