
మానవత్వంతో సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన సమస్యలను మానవతా దృక్పఽథంతో ఆలోచన చేసి పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆయన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి 108 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా, రెవెన్యూ అధికారి కె. హేమలత, కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉపకలెక్టర్ డా.పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి భాగస్వామ్యులయ్యారు. అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి సమస్య పరిష్కరం ఏ దిశలో ఉందో సెల్ఫోన్ మెసేజ్ ద్వారా అర్జీదారుకు తెలియజేయనున్నట్లు తెలిపారు. కావున ఆర్జీల పరిష్కార ప్రక్రియలో ఎటువంటి పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి సమస్యకు నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సంతృప్తే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.
పీజీఆర్ఎస్లో అందిన కొన్ని వినతులు
● పార్వతీపురం మండలం జగన్నాథపురం గ్రామ యవత పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యాలా అవసరమైన పుస్తకాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్.ప్రవీణ్ తదితరులు వినతిపత్రం అందజేశారు.
● పాచిపెంట మండలం గంగన్న దొరకోనవలస గ్రామానికి ఉపాధిహామీ పథకం కింద సీసీ రోడ్డు, కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 5లక్షల నిధులను మంజూరు చేసినప్పటికీ గ్రామసర్పంచ్, ఎంపీడీఓ అనుమతులు మంజూరు చేయడం లేదని, కావున అనుమతులు మంజూరుపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామస్తులు విన్నవించారు.
● తోటపల్లి రిజర్వాయర్లో బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి కల్పించాలని జి.చిరంజీవి, తోట ప్రసాద్, అల్లు సురేష్, సమ్మిడి రాజేష్ వినతిపత్రం అందజేశారు.
● కొమరాడ మండలం అర్తాం రెవెన్యూ పరిధిలోని 0.3 ఎకరాల కొండ పోరంబోకు భూమిని సాగు చేసుకుంటున్నామని, ఆ భూమికి పట్టాదారు పాస్పుస్తకాన్ని మంజూరు చేయాలని కోరుతూ కె. కృష్ణందొర వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.
వాస్తవాలైతే చట్టపరిధిలో చర్యలు
పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల దర్యాప్తులో వాస్తవాలు అయినట్లయితే చట్టపరిధిలో తక్షణమే చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ఫిర్యాదు దారుల నుంచి స్వయంగా సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సంబంధించిన స్టేషన్ అధికారులకు సిఫార్సు చేయనున్నామని, ఆయా అధికారులు ఫిర్యాదులు వాస్తవాలైతే చట్టపరమైన చర్యలతో పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ సిబ్బందికి ఫోన్లో ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో ముఖ్యంగా కుటుంబ కలహాలు, భర్త, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, అత్తారింటి వేధింపులు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూలు, ప్రేమ పేరుతో మోసాలపై పలు ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. కార్యక్రమంలో 6 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. డీసీఆర్బీ ఎస్ఐ ఫకృద్దీన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 46 వినతులు
సీతంపేట: ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 46 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో పుబ్బాడ గ్రామస్తులు పద్మ గ్రామానికి సీసీ రోడ్డు వేయాలని కోరారు. రెల్లిగూడకు చెందిన బంగారమ్మ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని, వరదగోడ తన గ్రామంలో నిర్మించాలని రాజమానుగూడకు చెందిన సవర చిన్నారావు విజ్ఞప్తి చేశారు. సవర నవీన్ వన్బీ అడంగల్ ఇప్పించాలని కోరారు. తాగునీటి బోరు ఏర్పాటు చేయాలని కుంబికి చెందిన రామారావు వినతి అందజేశారు. వీధికాలువలు నిర్మించాలని మెట్టుగూడ గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొర, పీహెచ్వో ఎస్వీ గణేష్, ఏఎంఓ కోటిబాబు, పీఆర్ ఏఈ కిరణ్, సీడీపీఓ రంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్

మానవత్వంతో సమస్యలు పరిష్కరించాలి

మానవత్వంతో సమస్యలు పరిష్కరించాలి