పార్వతీపురం: చిరుధాన్యాల మహోత్సవాన్ని ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్నట్టు కలెక్టర్ నిషాంత్కుమార్ తెలిపారు. ఆరోగ్యానికి చిరుధాన్యాలు అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. చిరుధాన్యాల మహోత్సవం నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో తన కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిరుధాన్యాల మహోత్సవం విజయవంతం చేయాలన్నారు. ఆన్ని చిరు ధాన్యాలలో మానవ ఆరోగ్యానికి అవసరమైనటువంటి కాల్షియం, ఇనుము, మెగ్నిషియం, భాస్వరం అనే ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. చిరుధాన్యాల ఆహార పదార్థాలను స్టాల్స్లలో అమ్మకానికి, ప్రదర్శనకు పెట్టే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. చిరుధాన్యాలు యొక్క ప్రాముఖ్యత, మానవ ఆరోగ్యం అనే విషయంపైన వ్యాసరచన పోటీలు మండలాల స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో చిరు ధాన్యాలపై దృష్టి సారించాలని, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి.కిరణ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్పాల్, డీఈఓ ఎస్డీవీ రమణ, టీపీఎంయూ ఏపీడీ వై.సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.