13న ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన
నగరంపాలెం: సనాతన భారతీయ ధర్మంలో సంగీతానికి విశేష ప్రాముఖ్యత ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం బృందావన్గార్డెన్న్స్లోని ఆయన కార్యాలయంలో జై కిసాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 13న శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన కార్యక్రమాల ఆహ్వాన పత్రికలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంగీతంలో మనుషులతోపాటు పశుపక్షాదులు ఓలలాడతాయని పేర్కొన్నారు. అన్నమయ్య సహస్ర గళార్చన నిర్వాహకులు బండ్లమూరి స్వామి మాట్లాడుతూ భారతీయ జీవన విధానంలో హిందూ ధర్మం అంటే సన్మార్గమని అన్నారు. మానవుడిని సన్మార్గంలో నడిపించే ఒక జీవన విధానమని చెప్పారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సేవలో భాగంగా రాష్ట్రస్థాయిలో వందల మంది గాయకులతో ద్వితీయ అన్న మయ్య సహస్ర గళార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7799800900 నంబర్లో సంప్రదించాలని కోరారు.
చిలకలూరిపేట: హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరంగా మారిందని, ఈ పదం వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హీరో ఆరాధన వల్ల బాల్యదశ నుంచి యువత భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. సినిమాలో నటించేవారిని హీరోకు బదులుగా లీడ్ యాక్టర్, లీడ్ యా క్ట్రెస్ అని సంబోధించాలని కోరారు. విద్యార్థులు హైస్కూల్ స్థాయి నుంచే హీరో పాత్రధారులను ఆరాధ్యులుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్నల కన్నా, జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే హీరోలను గొప్పవాళ్లుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు రూ.200 కోట్లు, రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుకోవడం వల్ల సినిమా ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూ.10 మొక్కజొన్న పేలాలకు వందలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. ఈ విషయాలను పరిశీలించి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఎమ్మార్పీ ధరలకే సినిమా క్యాంటీన్లలో విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో హరిప్రసాద్, మురుకొండ వెంకట్రావు, వెంకటేశ్వరరెడ్డి, అడపా రవి పాల్గొన్నారు.


