గంజాయి అమ్ముతున్న ఐదుగురు యువకుల అరెస్టు
మాచర్ల రూరల్: గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి బాటిల్స్లో నింపి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి 494 గ్రాముల 260 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువకులలో ఒకడైన మచిలీపట్నానికి చెందిన రమణీ అరవింద్, షేక్ నాగూర్ షరీఫ్, షేక్ నజీర్, షేక్ పఠాన్ సిరాన్ ఖాన్, షేక్ సలీం అనే యువకులు ఒడిస్సాలోని చిత్రకొండ పరిసరాలలో గంజాయితో తయారు చేసే హ్యాష్ ఆయిల్ బాటిల్స్ తెచ్చి మాచర్ల పట్టణ, పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు, యువకులకు అమ్ముతున్నారు. రూరల్ సీఐ షేక్ నఫీజ్ బాషా నేతృత్వంలో వెల్దుర్తి ఎస్ఐ డి. అశోక్ తనకు వచ్చిన సమాచారంతో మండాదిలోని కానాగు వాగు దగ్గరకు సిబ్బందితో వెళ్లారు.అక్కడ గంజాయి ఆయిల్ను 5ఎం.ఎల్. బాటిళ్లలో నింపుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు యువకులు సులభమార్గంలో డబ్బులు సంపాదించేందుకు విద్యార్థులు, యువకులను టార్గెట్గా చేసుకొని గంజాయి, డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు డీఎస్పీ జగదీష్ తెలిపారు. వీటిని అరికట్టేందుకు పోలీసులతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పట్టణ, గ్రామ శివారులో తనిఖీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాలేజీలలో అవగాహన కార్యక్రమాలతో పాటు యాజమాన్యంతోనూ ప్రత్యేకంగా చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి లిక్విడ్ను స్వాధీనం చేసుకుని, యువకులను అదుపులోకి తీసుకున్న రూరల్ సీఐ షేక్ నసీబ్ బాషా, వెల్దుర్తి ఎస్ఐ డి. అశోక్, సిబ్బందిలను పల్నాడు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారన్నారు. వీరికి రివార్డులను అందించనున్నట్లు ఆయన తెలిపారు.
494 గ్రాముల లిక్విడ్ స్వాధీనం


