రైతులు క్లస్టర్ విధానం అవలంబించాలి
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: జిల్లాలో రైతులు ప్రాంతాలను బట్టి క్లస్టర్ విధానంలో పంటలు సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలు ఆర్జించవచ్చని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఎఫ్పీఓ రైతులకు మునగ విత్తనాలు, సంక్షేమ హాస్టళ్లకు కంప్యూటర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక పంట ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ వరకూ అన్నీ ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండటం వల్ల రైతులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు దక్కుతాయన్నారు. రైతులకు మునగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు భూమి, సబ్సిడీలో రుణాలు అందిస్తామన్నారు. విత్తనాల పంపిణీతో సరిపెట్టకూడదని, పది కాలాలపాటూ రైతులకు ఆదాయానిచ్చే వనరుగా మునగ సాగును అభివృద్ధి చేసేలా శిక్షణ నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అనంతరం సీఎస్ఆర్ నిధులతో ఇన్పోసిస్ అందజేసిన కంప్యూటర్లు, దుప్పట్లను సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కలెక్టర్ పంపిణీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్ఓ మురళి, డీఆర్డీఎ పీడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు.
నేడు ప్రభుత్వ కార్యాలయాల్లో
సత్యసాయి జయంతి వేడుకలు
రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి 100వ జయంతి వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ–వార్డు సచివాలయ సెక్రెటరీలు తమ పరిధిలోని కార్యాలయాల్లో సత్యసాయి జయంతి వేడుకలలో పాల్గొనాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.


