ఘనంగా బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ గొప్ప సంఘ సంస్కర్త అని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. జింఖానా మైదానం సమీపంలోని బాబూజగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద ఆయన జయంతిని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం నేతలతో కలిసి జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి దేవినేని అవినష్‌ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. జగ్జీవన్‌రామ్‌ దళితుల అభివృద్ధి కోసం పాటుపడ్డారన్నారు. దళితులు ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకున్న వ్యక్తి అని కొనియాడారు. వైఎస్సార్‌ సీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల అభివృద్ధికి పెద్ద పీట వేసిందన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఆశయాలను కొనసాగించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల సంక్షేమం, అభివృద్ధి గాలికి వదిలేశారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగ్జీవన్‌రామ్‌ వంటి మహనీయులు చూపిన బాటలో నడవాలన్నారు. ఈ కార్య క్రమంలో మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఆసిఫ్‌, ఎస్సీ సెల్‌ ప్రెసిడెంట్‌ శరత్‌, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం ఎస్సీ సెల్‌ ప్రెసిడెంట్‌ శ్యామ్‌, కాలే పుల్లారావు, త్రివేణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement