
సుప్రీం తీర్పు.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమ అరెస్టులు ఎల్లకాలం చెల్లవని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టు అయ్యిందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎలా బలహీన పరచాలని చూస్తూనే, సాక్షి మీడియాపై దాడులు చేయించిందన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే సాక్షి కార్యాలయాలపై దాడి చేయించారని చెప్పారు. సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించే వారిని అరెస్ట్ చేయడం అక్రమమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు. ఈ తీర్పు ద్వారా సుప్రీం కోర్టు ప్రజాస్వామ్య పునాదులను నిలబెట్టిందని తెలిపారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రభుత్వానికి ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిదన్నారు. సాక్షి కార్యాలయాలపై దాడి చేసిన రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్పింది వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్